Kiren Rijiju: భారతదేశం సెక్యులర్ దేశమని, ఈ దేశంలో మైనారిటీలు అత్యంత సురక్షితంగా ఉంటున్నారని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు అన్నారు. హిందువులు మెజారిటీగా ఉండటం కారణంగానే మైనారిటీలు సంపూర్ణ స్వేచ్ఛ, రక్షణ పొందుతున్నారని చెప్పారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో నుంచి ఒక్క మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తి కూడా వలస వెళ్లడాన్ని నేను ఎప్పుడూ చూడలేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ, దాని వావపక్ష ఎకోసిస్టమ్ మైనారిటీలను చంపుతున్నారని, కొడుతున్నారని, దేశంలో వారు సురక్షితంగా లేరని నిరంతరం తప్పుడు ప్రచారాన్ని చేస్తుందని ఆరోపించారు. ఇలాంటి కథనాలు దేశానికి సాయం చేయవని ఆయన అన్నారు.
Read Also: Tirupati: భార్యను కిరాతకంగా హత్య చేసి.. తానూ ఆత్మహత్య చేసుకున్న భర్త.. కారణం ఏంటి..?
దేశంలో మైనారిటీ, మెజారిటీకి చెందిన వారెవరైనా కూడా చట్టం, రాజ్యాంగం ముందు అంతా సమానమే అని చెప్పారు. మెజారిటీ వర్గానికి ఏం లభిస్తుందో, మైనారిటీలకు కూడా అదే లభిస్తుందని తాను స్పష్టంగా చెప్పగలనని రిజిజు అన్నారు. కొన్ని సందర్భాల్లో మైనారిటీలకే కొన్ని విషయాలు లభిస్తాయని, మెజారిటీలకు లభించవని చెప్పారు. టిబెట్, మయన్మార్, శ్రీలంక, బంగ్లాదేశ్లో మైనారిటీలపై హింస జరిగినప్పుడు వారంతా భారత్పై నమ్మకంతో ఇక్కడి వచ్చి ఆశ్రయం పొందాలని కోరుకుంటారని అన్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్లలో ప్రతీ గిరిజన సమూహం, మైనారిటీలు తమ సొంత దేశంలోనే అన్యాయాలకు గురవుతున్నారని, కానీ దేశంలో హిందూ సమాజంలో లౌకిక స్వభావం సహనాన్ని కలిగి ఉందని చెప్పారు. అందుకే భారత్ ప్రతీ మైనారిటీ సమాజానికి ఇష్టమయ్యే ప్రాంతమని చెప్పారు.