కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ దేశంలో కల్లోలమే సృష్టించింది.. కొత్త రికార్డుల సృష్టించాయి పాజిటివ్ కేసులు, మృతుల సంఖ్య… క్రమంగా కేసులు తగ్గినట్టే తగ్గినా.. పూర్తిస్థాయిలో అదుపులోకి రాలేదు.. కానీ, మరోమారు విజృంభించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వెలువడుతున్న గణాంకాలే ఇందుకు సూచికలుగా నిలుస్తున్నాయి. వారం రోజుల వ్యవధిలో కరోనా కేసుల సంఖ్య రెండింతలయ్యింది. కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపిన వివరాల ప్రకారం సోమవారం నాడు పాజిటివిటీ రేటు 3.4 శాతంగా నమోదు కాగా.. అంతకుమందు వారంలో ఇది 1.68 శాతంగా ఉంది. ఈ గణాంకాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వైద్య నిపుణులు.. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా థర్డ్ వేవ్ ప్రారంభమైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) హెచ్చరించగా.. కరోనా కేసులు తగ్గడానికి బదులు రోజురోజుకు పెరుగుతుండటం గమనార్హం. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే కరోనా థర్డ్ వేవ్ తప్పదని నిపుణులు చెబుతున్నారు. జూలై 20న పాజిటివిటీ రేటు 1.68 శాతంగా ఉండగా.. 21న 2.27 శాతంగా.. జూలై 22న 2.4 శాతం, 23న 2.12 శాతం, 24న 2.4 శాతం, 25న 2.31 శాతంగా.. 26న 3.4 శాతంగా ఉండడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.