Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ కేసులో కేజ్రీవాల్ నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. లిక్కర్ కుంభకోణం కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన నివాసం వద్ద భారీగా భద్రతా బలగాలు మోహరించాయి.
దీనికి ముందు ఈ రోజు ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్ ఆరెస్ట్ గురించి కీలక తీర్పు వెల్లడించింది. ఈ కేసులో అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు హైకోర్టు నిరాకరించింది. ఎక్సైజ్ పాలసీ కేసులో ఆయనకు ఈడీ అరెస్ట్ నుంచి మధ్యంతర రక్షణ కల్పించలేమని స్పష్టం చేసింది. తాను ఈడీ విచారణకు హాజరవుతాను కానీ, తనను అరెస్ట్ చేయబోమని ఈడీ కోర్టులో హామీ ఇవ్వాలని కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు తన నిర్ణయాన్ని వెల్లడించింది. ఈ కేసులో ఈడీ తన ప్రతిస్పందన తెలియజేయాలని కోరుతూ.. ఏప్రిల్ 22కి వాయిదా వేసింది.
Read Also:Drugs: ఆపరేషన్ గరుడ.. విశాఖ సీపోర్ట్లో 25వేల కేజీల డ్రగ్స్ స్వాధీనం
కోర్టు తన నిర్ణయాన్ని ప్రకటించిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈడీ అధికారులు కేజ్రీవాల్ నివాసంలో సోదాలు నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. దాదాపుగా 8 నుంచి 12 మంది అధికారులు కేజ్రీవాల్ నివాసంలో ఉన్నట్లు సమాచారం. కేజ్రీవాల్ ఇప్పటి వరకు 9 సార్లు ఈడీ సమన్లను దాటవేయగా..10వ సారి సమన్లు ఇచ్చేందుకు ఈడీ బృందం అక్కడికి చేరుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కేజ్రీవాల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ కేసులో ఇప్పటికే ఆప్ నేతలు సత్యేందర్ జైన్, మనీస్ సిసోడియా, సంజయ్ సింగ్లను ఈడీ అరెస్ట్ చేసింది.
#WATCH | Enforcement Directorate team reaches Delhi CM Arvind Kejriwal's residence for questioning: ED pic.twitter.com/kMiyVD6vhf
— ANI (@ANI) March 21, 2024