Congress Leader Seek Bharat Ratna For Mulayam Singh Yadav: సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకులు, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ ఇటీవల మరణించారు. దివంగత ములాయం సింగ్ యాదవ్ కు మరణానంతరం దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేత. మహారాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహ్మద్ ఆరిఫ్ నసీమ్ ఖాన్..ములాయంకు భారతరత్న ఇవ్వాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు లేఖ రాశారు.
Read Also: Gujarat Elections: ఈ రోజు మధ్యాహ్నం వెలువడనున్న గుజరాత్ ఎన్నికల షెడ్యూల్
సమాజ్ వాదీ పార్టీ దివంగత నేత ములాయం సింగ్ అణగారిన వర్గాల కోసం పోరాడారని లేఖలో పేర్కొన్నారు. ఆయన మృతికి యావత్ దేశం సంతాపం వ్యక్తం చేసిందని.. ఆయన సేవలను కోట్లాది మంది కొనియాడారని, అందుకు గుర్తింపుగా ఆయనకు భారతరత్న ఇవ్వాలని అభ్యర్థిస్తున్నట్లు ఆరీఫ్ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు ప్రధాని నరేంద్రమోదీకి కూడా ఆయన లేఖ రాశారు.
ఇదిలా ఉంటే పార్టీలకు అతీతంగా ములాయం సింగ్ సేవలను గుర్తు చేసుకుంటున్నారు నాయకులు. బల్లియాకు చెందిన బీజేపీ ఎంపీ వీరేంద్ర సింగ్ గత నెలలో ములాయం జ్ఞాపకార్థంగా ఎంపీ ఫండ్స్ నుంచి రూ. 25 లక్షలు మంజూరు చేశారు. ఈ నిధులతో బల్లియా జిల్లా కోర్టు అవరణలో ఆడిటోరియాన్ని నిర్మించనున్నారు. దీనికి ‘‘ధర్తిపుత్ర ములాయం సింగ్ యాదవ్ సంవాద్ భవన్’’ అని పేరు పెట్టనున్నారు. నేతాజీగా పిలుచుకునే ములాయంసింగ్ గతంలో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు.