Chandrayaan-3 : నిండు చందమామను చూసి పొంగిపోని వారు ఎవరుంటారు. అలాంటి చందమామ సొగసు చూస్తూ వేల ఏళ్లుగా మురిసిపోతున్నాం. ఎన్నో కావ్యాలకు ప్రేరణగా నిలిచిన ఆ వెన్నెల రాజ్యాన్ని శోధించాలని మానవ లోకం తపిస్తూనే ఉంది. ఆ క్రమంలో కొన్ని అగ్రరాజ్యాలు చకచకా వెళ్లి జెండాలు పాతి వచ్చినా.. నెలరాజు పూర్తి గుట్టు మాత్రం విప్పలేకపోయాయి. వాటితో పోలిస్తే జాబిల్లిపై పరిశోధనలను భారత్ కాస్త ఆలస్యంగా ప్రారంభించినప్పటికీ.. చంద్రయాన్-1 రూపంలో చేపట్టిన తొలి యత్నంలోనే అద్భుత వార్తను ప్రపంచానికి అందించింది. చందమామపై నీరుందని తేల్చి.. విశ్వపరిశోధనల్లో కొత్త శ్వాస నింపింది. ఇప్పుడు మళ్లీ చంద్రయాన్-3 పేరుతో ఇప్పటిదాకా చంద్రుడిపై ఎవరూ వెళ్లని దారులకు.. ఎవరూ చూడని దక్షిణ జాడల్ని చూడటానికి.. అక్కడి నిగూఢ రహస్యాలను ఛేదించడానికి శుక్రవారం శ్రీహరికోట నుంచి భారత వ్యోమనౌక నింగికెగరబోతోంది. బాహుబలి రాకెట్గా గుర్తింపు పొందిన ఎల్వీఎం3-ఎం4.. దీన్ని మోసుకెళ్లనుంది. చంద్రయాన్-2 పేరిట నాలుగేళ్ల కిందట జాబిల్లిపై ల్యాండింగ్కు ప్రయత్నిస్తున్న క్రమంలో ఎదురైన వైఫల్యం నుంచి పాఠాలు నేర్చుకున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో).. రెట్టించిన ఉత్సాహంతో రేపటి ప్రయోగానికి సిద్ధమైంది.
Read also: Son Kill Father: భూమికోసం తండ్రి కాళ్లు నరికి దారుణంగా హతమార్చిన కొడుకు
ఇప్పటివరకూ అమెరికా(యూఎస్ఏ), సోవియట్ యూనియన్(రష్యా), చైనా మాత్రమే చందమామపై ల్యాండర్లను ఎలాంటి ఇబ్బంది లేకుండా దించాయి. మనకంటే ముందే ఆ దేశాలు చందమామను చేరుకున్నప్పటికీ… అమెరికానైతే ఏకంగా మానవులనే చంద్రుడిపైకి పంపించినా… ఇప్పుడు భారత్ చేస్తున్న యత్నానికో ప్రత్యేకత ఉంది. అదే ఇప్పటిదాకా చంద్రుడిపై ఎవరూ వెళ్లని దక్షిణ ధ్రువానికి వెళ్లటం… అక్కడి ప్రత్యేక పరిస్థితుల గురించి శోధించటం. ఇప్పటిదాకా చంద్రుడిపైకి వెళ్లిన వ్యోమనౌకల్లో అత్యధికం అక్కడి మధ్య రేఖా ప్రాంతంలోనే దిగాయి. భారత్ మాత్రం చంద్రయాన్-3 కోసం ఇంతవరకూ వెలుగు చూడని దక్షిణ ధ్రువానికి దగ్గర్లోని 70 డిగ్రీల అక్షాంశం వద్ద ప్రాంతాన్ని ఎంచుకుంది. ఇలా భారత్ వినూత్న ప్రదేశాన్ని ఎంచుకోవడం వెనుక బలమైన కారణాలున్నాయి. అక్కడ ల్యాండింగ్ ద్వారా విశ్వం ఆవిర్భావం గురించిన కొత్త విషయాలను తెలుసుకునే అవకాశం ఉండటంతో పాటు.. మునుముందు చంద్రుడిపై మానవ ఆవాసాల ఏర్పాటుకు బాటలు పడతాయనుకుంటున్నారు. చంద్రుడిపై దక్షిణ ధ్రువ ప్రాంతంలో భౌతిక పరిస్థితులు ఎంతో ప్రత్యేకం. చంద్రుడి ఉత్తర ధ్రువంతో పోలిస్తే దక్షిణ ధ్రువ ప్రాంతంలోని కొన్ని భాగాలు శాశ్వతంగా చీకట్లో ఉంటాయి. వందలకోట్ల ఏళ్లుగా ఆ ప్రాంతాలను సూర్యకాంతి స్పృశించలేదు. అందువల్ల అక్కడి మూలకాలు సౌర రేడియోధార్మికత కారణంగా తలెత్తే మార్పులకు లోనుకాకుండా ఉంటాయి. వాటిని శోధిస్తే విశ్వాన్ని గురించిన అనేక నిగూఢ రహస్యాలు తెలిసే అవకాశాలున్నాయి. అక్కడి పురాతన శిలలపై పరిశోధనలు జరపడం ద్వారా విశ్వ ఆవిర్భావం.. తొలినాటి సౌర కుటుంబ చరిత్ర గురించి కొత్త వివరాలు తెలుసుకోవచ్చు.
Read also: Mohammed Siraj Catch: డైవింగ్ చేస్తూ.. ఒంటి చేత్తో స్టన్నింగ్ క్యాచ్! సిరాజ్ వీడియో వైరల్
చంద్రయాన్-1తో వెలుగులోకి నీటి జాడ
2008 నుంచి చంద్రుడిని భారత్ శోధిస్తోంది. ఆ ఏడాది అక్టోబరు 22న పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా చంద్రయాన్-1ను ప్రయోగించింది. 2008 నవంబరు 8న అది చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. అక్కడే ఉంటూ పరిశోధనలు సాగించింది. దీనిలో భాగంగా ప్రయోగించిన 35 కిలోల మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ (ఎంఐపీ) చందమామ ఉపరితలంపై నీటి జాడను తొలిసారిగా కనుగొనబడింది. చంద్రయాన్-1కు కొనసాగింపుగా రూ.978 కోట్లతో చంద్రయాన్-2ను భారత్ చేపట్టింది. 2019 జులై 22న శ్రీహరికోట నుంచి ప్రయోగించారు. 48 రోజుల ప్రయాణం తర్వాత ఆర్బిటర్ చందమామ కక్ష్యలోకి దిగ్విజయంగా చేరింది. 2019 సెప్టెంబరు 7 అర్ధరాత్రి సమయంలో ల్యాండర్, రోవర్తో కూడిన మాడ్యూల్.. అనుకున్న రీతిలో ఆర్బిటర్ నుంచి విడిపోయింది. చంద్రుడి దక్షిణ ధ్రువం దిశగా ప్రయాణంలో జాబిల్లి ఉపరితలానికి 2 కిలోమీటర్ల ఎత్తులో ఇబ్బంది తలెత్తింది. నియంత్రణ కోల్పోయి, చంద్రుడిని బలంగా ఢీ కొట్టింది. ల్యాండర్, రోవర్లు ధ్వంసమయ్యాయి. చంద్రయాన్-2కు సంబంధించిన ఆర్బిటర్ మాత్రం ఇంకా పనిచేస్తోంది. చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తూ విలువైన డేటాను అందిస్తోంది.
చంద్రయాన్-2 లోపాల నుంచి పాఠాలు నేర్చుకొని ఇప్పుడు దక్షిణ ధ్రువం వద్ద ఉన్న చీకటి బిలాల్లో ఉష్ణోగ్రత మైనస్ 248 డిగ్రీల సెల్సియస్గా ఉంటుంది. ఆ స్థాయి శీతల ఉష్ణోగ్రతలతో అవి ‘కోల్డ్ ట్రాప్స్’గా పనిచేస్తాయి. అంటే వాటిలో నీరు హిమరూపంలో స్థిరంగా ఉండే అవకాశాలున్నాయి. అందువల్ల కొన్ని బిలాల్లో గణనీయ పరిమాణంలో మంచు నిల్వలు ఉండొచ్చని భావిస్తున్నారు. నీరు ఉండటం వల్ల జీవజాలం మనుగడ ఆస్కారాలను శోధిస్తారు. అందువల్ల చంద్రయాన్-3 పూర్తిగా కొత్త ప్రదేశాన్ని శాస్త్రసమాజం ముందు ఆవిష్కరిస్తుంది. భవిష్యత్లో చేపట్టబోయే మానవసహిత, రోబోటిక్ యాత్రలకు ఈ డేటా ఉపకరిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. తరతరాలుగా మానవాళికి చందమామ ప్రధానాకర్షణగా మారింది. సైన్స్ కోణంలో కుతూహలాన్ని రగిలిస్తోంది. చంద్రుడి పుట్టుక.. పరిణామం సాగిన తీరు ఆసక్తికరంగా మారాయి. కోట్ల ఏళ్ల పాటు అనేక అంతరిక్ష శిలల ఢీని తట్టుకొని అది నిలబడింది. వచ్చే కొన్నేళ్లలో జాబిల్లిపై ఆవాసాన్ని ఏర్పాటు చేయాలని, దాన్ని ఇతర గ్రహాల అన్వేషణకు మజిలీగా ఉపయోగించుకోవాలని అనేక దేశాలు భావిస్తున్నాయి. భూమితో పోలిస్తే చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి ఆరో వంతే ఉంటుంది. గాలి కూడా ఉండదు. అందువల్ల భూమితో పోలిస్తే చందమామ నుంచి రాకెట్ ప్రయోగాలు చేయడం చాలా సులువు.