Ayodhya Ram Mandir: అయోధ్య భవ్య రామ మందిర ప్రారంభోత్సవానికి మరో నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది. యావత్ దేశంతో పాటు ప్రపంచంలోనే రామ భక్తులు దీని కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. జనవరి 22న రామ్ లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమంతో రామ మందిరం ప్రారంభం కానుంది. జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12:15 గంటల నుంచి 12:45 గంటల మధ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది. గర్భగుడిలో బాల రాముడి (5 ఏళ్ల రాముడి రూపం) సూచించే విగ్రహం ఉంటుంది.
“ప్రాణ ప్రతిష్ట” సమయంలో గర్భగుడిలో ఎవరు ఉంటారు..?
ప్రాణ ప్రతిష్ట సమయంలో గర్భగుడిలో కేవలం ఐదుగురు వ్యక్తులు మాత్రమే ఉంటారు. వారు
1) ప్రధాని నరేంద్రమోడీ
2) రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్
3) ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్
4) ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్
5) రామమందిరం ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్
ప్రాణ ప్రతిష్ట అంటే ఏమిటి..?
‘‘ప్రాణ ప్రతిష్ట’’ అనేది హిందూ మతంతో పాటు జైన మతంలో ఒక ప్రసిద్ధ ఆచారం. ఆలయం వంటి పవిత్ర స్థలాల్లో దేవతా విగ్రహాలను ప్రతిష్టించే సమయంలో పూజారులు వేద మంత్రోచ్ఛారణ మధ్య క్రతువును నిర్వహిస్తారు. ప్రాణ ప్రతిష్టలో ప్రాణ్ అంటే ప్రాణశక్తి, ప్రతిష్ట అంటే స్థాపన. విగ్రహానికి ప్రాణశక్తిని అవాహన చేయడమే ప్రాణ ప్రతిష్ట.
ప్రాణ ప్రతిష్ట ఎలా నిర్వహిస్తారు.?
ప్రాణ ప్రతిష్ట సమయంలో ఆలయాన్ని మూసి ఉంచుతారు. స్వామి వారి కళ్లకు గంతలు తెరిచి, అద్దంలో ఆయనకు విగ్రహాన్ని చూపించడంతో కార్యక్రమం పూర్తవుతుంది.
ఆ తర్వాత హారతి, మూడు బృందాల ఆచార్యుల పూజలు నిర్వహిస్తారు. మొదటి బృందానికి స్వామి గోవింద్ దేవగిరి మహరాజ్, రెండవ బృందానికి శంకరాచార్య విజేంద్ర సరస్వతి, మూడవ బృందంలో కాశీ పండితులు పూజలు నిర్వహిస్తారు.
రాముడు తన సింహాసనంపై ఆసీనులయ్యే వరకు విగ్రహానికి కళ్లగంతలు ఉంటాయి. ప్రాణప్రతిష్ట మొత్తం కార్యక్రమం పూర్తైన తర్వాత దాన్ని తొలగిస్తారు. ప్రధాన పోషకుడి పాత్ర పోషిస్తున్న ప్రధాని నరేంద్రమోడీ రాముడి విగ్రహానికి గంతలను తొలగించి, ఆ తర్వాత అద్దంలో విగ్రహాన్ని చూపించనున్నారు. ఆ తర్వాత హారతి నిర్వహిస్తారని చెప్పారు. హారతి అనంతరం భక్తులకు నైవేధ్యాన్ని పంపిణీ చేస్తారు.