Karnataka: 2024 లోక్ సభ ఎన్నికల కోసం అన్ని పార్టీలు సిద్ధం అవుతున్నాయి. ముఖ్యంగా ఈ సారి బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ తో పాటు ఇతర విపక్షాలన్నీ కలిసి కూటమిగా ఏర్పడేందుకు చర్చలు జరుగుతున్నాయి. బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు. టీఎంసీ, ఎన్సీపీ, జేడీయూ, ఎస్పీ వంటి ప్రాంతీయ పార్టీలు విపక్షాల ఐక్యత గురించి మాట్లాడుతున్నాయి. అందరం కలిసికట్టుగా ప్రయత్నిస్తే ఈ సారి మోడీని గద్దె దించవచ్చని భావిస్తున్నాయి.
ఇదిలా ఉంటే ఇన్నాళ్లు బీజేపీ అంటే అంటీముట్టనట్లు ఉన్న మాజీ ప్రధాని దేవెగౌడ పార్టీ అయిన జనతాదల్ సెక్యులర్(jds) మాత్రం బీజేపీకి దగ్గరవుతున్న వాతావరణం కనిపిస్తోంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ రెండు పార్టీల మధ్య మళ్లీ స్నేహం చిగురిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో బీజేపీ-జేడీఎస్ పార్టీలు కలిసి పోటీ చేశాయి. ఈ సారి 2024 ఎన్నికల్లో కూడా కలిసి పోటీ చేసే అవకాశం కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2024 ప్రతిపక్ష ఐక్యత గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు జేడీఎస్. బీజేపీకి మాజీ మిత్రుడైన జేడీఎస్ కలిసి 2006లో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. 2006లో ఈ రెండు పార్టీలు కలిసి సంక్షీర్ణాన్ని ఏర్పాటు చేసిన అయితే ముందు కుదిరిన ఒప్పందం ప్రకారం.. ముఖ్యమంత్రి కుమారస్వామి, తన డిప్యూటీ అయిన యడియూరప్పకు అధికారాన్ని బదిలీ చేయకపోవడంతో ప్రభుత్వం కుప్పకూలింది.
గత నెలలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్ పార్టీలు కాంగ్రెస్ చేతిలో ఓడిపోయాయి. జేడీఎస్ 224 అసెంబ్లీ స్థానాల్లో కేవలం 19 స్థానాలను గెలిచింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీజేపీతో జతకడితే.. తన ఓట్ బేస్ ను కాపాడుకునే అవకాశం ఉందని జేడీఎస్ భావిస్తోంది. ఇటీవల నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవాన్ని కాంగ్రెస్ తో పాటు అన్ని ప్రధాన విపక్ష పార్టీలు బహిష్కరించినా.. జేడీఎస్ తరుపున దేవెగౌడ హాజరయ్యారు. ఇటీవల బాలాసోర్ రైలు ప్రమాదం సమయంలో విపక్షాలు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాజీనామాకు డిమాండ్ చేశాయి. అయితే ఆ సమయంలో కూడా దేవెగౌడ బీజేపీకి మద్దతుగా నిలిచారు. అశ్విని వైష్ణవ్ ని సమర్థించారు. తాజాగా విపక్షాల ఐక్యత గురించి మాట్లాడుతూ.. దేశంలో బీజేపీతో సంబంధం పెట్టుకోని ఒక్క పార్టీనైనా చూపించాలంటూ సవాల్ విసిరారు.