Bangladesh: షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత బంగ్లాదేశ్లో మత ఛాందసవాదం మరింత పెరిగింది. బంగ్లాదేశ్ తాత్కాలిక అధినేత అయిన మహ్మద్ యూనస్ కూడా రాడికల్ ఇస్లామిక్ సంస్థలైన ‘‘జమాతే ఇస్లామీ’, ‘‘హిజ్బుత్ తెహ్రీర్’’ వంటి సంస్థలపై మెతక వైఖరి ప్రదర్శిస్తున్నాడు. దీంతో ఈ గ్రూపులు దేశవ్యాప్తంగా రెచ్చిపోతున్నాయి. మైనారిటీలు, ముఖ్యంగా హిందువులపై దాడులు నిత్యకృత్యంగా మారాయి.
Read Also: UP: ‘‘డ్రమ్లో ముక్కలవ్వడం ఇష్టం లేదు’’.. భార్య అక్రమ సంబంధంపై భర్త.. వీడియో వైరల్..
ఇదిలా ఉంటే, ఇప్పుడు బంగ్లాదేశ్ వ్యాప్తంగా అంతర్జాతీయ బ్రాండ్లు అయిన బాటా, పిజ్జా హట్, కేఎఫ్సీ షాపుల్ని ధ్వంసం చేస్తు్న్నారు. గత రెండు వారాలుగా గాజాలో ఇజ్రాయిల్ దాడుల్ని తీవ్రతరం చేయడంతో నిరసనకారులు హింసాత్మక దాడులకు దిగారు. ఢాకా, బోగ్రా, సిల్హెట్, కాక్స్ బజార్తో సహా బంగ్లాదేశ్లోని నగరాలు, పట్టణాలలో గాజాకు మద్దతుగా నిరసనలు నిర్వహించారు. ఇజ్రాయిల్తో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న షాపులపై దాడులు, లూటీలు చేస్తున్నారు. అల్లరి మూకలు షాపుల్ని ధ్వంసం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
విధ్వంసాలకు పాల్పడిన వారిని గుర్తించి అరెస్ట్ చేయాలని జనరల్ ఆఫ్ పోలీస్ బహరుల్ ఆలం దేశవ్యాప్తంగా అధికారులను ఆదేశించారు. మరోవైపు, ఢాకాలో యూఎస్ ఎంబసీ వద్ద భద్రతను పెంచారు. నిరసనకారులు దీనికి సమీపంలో అమెరికా వ్యతిరేక నినాదాలు చేశారు. కొందరు డొనాల్డ్ ట్రంప్ టార్గెట్గా నినాదాలు చేశారు. ఈ అల్లర్లు అధికార, ప్రతిపక్షాలకు మధ్య రాజకీయ వివాదాన్ని సృష్టించాయి. తాత్కాలిక అధినేత మహ్మద్ యూనస్ ఈ హింసను ఖండించగా, షేక్ హసీనా బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోందని ఆరోపించారు.