Trump Tariffs: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల పేరుతో బెదిరింపులు ఆపడం లేదు. ఇటీవల, ఆపిల్ అధినేత టిమ్ కుక్తో ట్రంప్ మిడిల్ఈస్ట్ పర్యటనలో భారత్లో ప్లాంట్ నెలకొల్పవద్దని, అమెరికాలో పెట్టాలని కోరారు. “అతను భారతదేశం అంతటా ఫ్లాంట్లు నిర్మిస్తున్నాడు. మీరు భారతదేశంలో ఫ్లాంట్లు నిర్మించడం నాకు ఇష్టం లేదు.” అని ట్రంప్ అన్నారు.
దీని తర్వాత, ఆపిల్ ఉత్పత్తిని అమెరికాకు మార్చకుంటే 25 శాతం సుంకం విధిస్తానని హెచ్చరించారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మంగళవారం వైట్ హౌస్లో ట్రంప్, ఆపిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టిమ్ కుక్ మధ్య జరిగిన సమావేశం తర్వాత ఈ హెచ్చరికలు వచ్చినట్లు అమెరికా అధికారులు చెబుతున్నారు.
Read Also: Vijayawada: విజయవాడ రైల్వేస్టేషన్కి బాంబు బెదిరింపు.. పాకిస్థాన్కు చెందిన వ్యక్తి ఫోన్ కాల్!
ఇదిలా ఉంటే, ఈ బెదిరింపు కేవలం ఆపిల్కి మాత్రమే కాదని, శామ్సంగ్కి కూడా వర్తిస్తాయని ట్రంప్ చెబుతున్నాడు. ఆపిల్తో సహా శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్తో సహా అందరు తయారీదారులను లక్ష్యంగా చేసుకుంటున్నానని, వారి పొడక్షన్స్ని అమెరికాకు తరలించడానికి ప్రోత్సహించానని ట్రంప్ చెప్పారు. ఇదే కాకుండా, దిగుమతి సుంకాలు సిద్ధంగా ఉన్నాయని, జూన్ చివరి నాటికి అమలు చేయబడుతాయని ట్రంప్ చెప్పాడు.
అంతకుముందు, మంగళవారం టిమ్ కుక్తో భేటీ తర్వాత ట్రంప్ మాట్లాడుతూ..‘‘ప్లాంట్లను నిర్మించడానికి భారతదేశానికి వెళ్తున్నానని ఆయన అన్నారు. భారతదేశానికి వెళ్లడం సరే, కానీ మీరు సుంకాలు లేకుండా ఇక్కడకు అమ్మబోరు అని నేను చెప్పాను’’ అని ట్రంప్ అన్నారు. అయితే, ట్రంప్ వ్యాఖ్యలపై ఆపిల్, శామ్సంగ్ స్పందించడానికి నిరాకరించాయి.
చైనాలో తయారైన వస్తువులపై దిగుమతి సుంకాల ప్రభావాన్ని పరిమితం చేయడానికి, ఆపిల్ భారత్లో పెద్ద ఎత్తున ఐఫోన్లు ఉత్పత్తి చేసి, అమెరికాకు ఎగుమతి చేస్తోంది. ఈ చర్య ట్రంప్ ఆగ్రహానికి కారణమైంది. అయితే, బ్లూమ్ బర్గ్ ఇంటెలిజెన్స్ ప్రకారం, అమెరికాలో ఉత్పత్తి ఖర్చు, సుంకాలు చెల్లించడం కన్నా ఎక్కువ అవుతుంది.