Pak spy: పాకిస్తాన్కి గూఢచారులుగా పనిచేస్తున్న వ్యక్తులు ఒక్కొక్కరుగా పట్టుబడుతున్నారు. ఇప్పటికే హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా వ్యవహారం సంచలనంగా మారిన సంగతి తెలిసింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత హర్యానా, పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్కి చెందిన 11 మందిని అరెస్ట్ చేశారు. తాజాగా, గుజరాత్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ATS) కచ్ సరిహద్దు ప్రాంతంలో మరో అనుమానిత గూఢచారిని అరెస్ట్ చేసింది. నిందితుడిని గుజరాత్ నివాసి అయిన సహ్దేవ్ సింగ్ గోహిల్గా గుర్తించారు. ఇతడికి పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ)తో సంబంధాలు ఉన్నాయని, భారతదేశానికి సంబంధించిన సున్నిత సమాచారాన్ని అందిస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి.
Read Also: Bengaluru: సౌండ్ తగ్గించమని అడిగితే.. భార్యపై యాసిడ్ దాడి చేసిన భర్త..
అధికారులు చెబుతున్న దాని ప్రకారం, సహ్దేవ్ గుజరాత్లోని కొన్ని సున్నిత ప్రాంతాల వివరాలను పంచుకున్నట్లు తెలిసింది. ఏటీఎస్ నిందితుడిని మరింత విచారించేందుకు అహ్మదాబాద్ తీసుకువచ్చారు. నిందితుగు కచ్లో ఆరోగ్య కార్యకర్త అయిన ఇతను పాకిస్తాన్ ఏజెంట్తో సున్నితమైన సమాచారాన్ని పంచుకున్నారనే ఆరోపణలపై అరెస్టు చేసినట్లు గుజరాత్ ATS ఎస్పీ కె. సిద్ధార్థ్ తెలిపారు. నిందితుడు బీఎస్ఎఫ్, భారత వైమానికదళానికి చెందిన వివరాలను అందచేస్తున్నట్లు సమాచారం ఉందని, మే 1న ప్రాథమిక విచారణ కోసం అతడిని కస్టడీలోకి తీసుకున్నట్లు చెప్పారు.
దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సహ్దేవ్కి జూన్-జూలై 2023లో వాట్సాప్లో అదితి భరద్వాజ్ అనే మహిళతో పరిచయం ఏర్పడిందని వెల్లడైంది. ఆమె పాకిస్తానీ ఏజెంట్ అని తర్వాత తెలిసింది. ఆమె బీఎస్ఎఫ్, ఐఏఎఫ్ సైట్ ఫోటోలు, వీడియోలను షేర్ చేయాలని కోరిందని సమాచారం. ముఖ్యంగా కొత్తగా నిర్మిస్తున్న లేదా నిర్మాణంలో ఉన్న ప్రదేశాలను, మీడియా ఫైళ్లను వాట్సాప్ ద్వారా సహ్దేవ్ పంపినట్లు తెలుస్తోంది. 2025లో తన ఆధార్ వివరాలతో సహ్దేవ్ సిమ్ కొనుగోలు చేసి, ఆ నెంబర్ ద్వారా వాట్సాప్ యాక్టివేట్ చేశాడు. ఈ నెంబర్ నుంచే వివరాలు పంచుకున్నాడు. ఇతను గుర్తు తెలియని వ్యక్తి నుంచి రూ. 40,000 కూడా అందుకున్నాడు. ప్రస్తుతం, ఇతడి మొబైల్ని ఫోరెన్సిక్కి పంపారు. తదుపరి విచారణ జరుగుతోంది.