ఆపరేషన్ సిందూర్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్నామొన్నటిదాకా భారత్-పాకిస్థాన్ యుద్ధాన్ని తానే ఆపానంటూ చెప్పుకుంటూ వచ్చిన ట్రంప్.. తాజాగా సరికొత్త వాదన తెరపైకి తెచ్చారు. తన జోక్యం లేకపోతే ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చనిపోయేవారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను అడ్డుతగలకపోతే రెండు దేశాల మధ్య అణు యుద్ధం జరిగి ఉండేదన్నారు. ఆ సమయంలో పాకిస్థాన్ ప్రధానితో సహా 35 మిలియన్ల మంది చనిపోయి ఉండేవారని వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Trump: భారత్ టార్గెట్గా ట్రంప్ మరో దాడి.. సౌరశక్తి ఉత్పత్తులపై 126 శాతం సుంకాలు విధింపు
బుధవారం అమెరికా పార్లమెంట్లో ట్రంప్ స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగం చేశారు. దాదాపు గంటా 41 నిమిషాల పాటు ప్రసంగించి చరిత్ర సృష్టించారు. ఈ సందర్భంగా 10 నెలల్లో ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిది యుద్ధాలను ఆపినట్లుగా గుర్తుచేశారు. ఇజ్రాయెల్-హమాస్, ఇజ్రాయెల్-ఇరాన్, ఈజిప్ట్- ఇథియోపియా, భారతదేశం-పాకిస్తాన్, సెర్బియా-కొసావో, రువాండా-కాంగో, అర్మేనియా-అజర్బైజాన్, కంబోడియా-థాయిలాండ్ యుద్ధాలు ఆపినట్లుగా చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Trump: అమెరికాలో ప్రస్తుతం స్వర్ణయుగం నడుస్తోంది.. వార్షిక ప్రసంగంలో ట్రంప్ వ్యాఖ్య
ఏప్రిల్ 22, 2025న పహల్గామ్లో ఉగ్ర మూకల దాడిలో 26 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతీకారంగా మే 7, 2025న భారత ప్రభుత్వం.. పాకిస్థాన్పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అలాగే పాకిస్థాన్ వైమానిక స్థావరాలు దెబ్బతిన్నాయి. నాలుగు రోజుల యుద్ధం తర్వాత పరస్పర ఒప్పందం కారణంగా కాల్పుల విరమణ జరిగింది. అయితే ఈ యుద్ధాన్ని తానే ఆపానంటూ ట్రంప్ ప్రకటించడంతో భారత్ ఖండించింది. కాల్పుల విరమణలో మూడో వ్యక్తి ప్రమేయం లేదని కొట్టిపారేసింది. పాకిస్థాన్ మాత్రం.. ట్రంప్ కారణంగానే యుద్ధం ఆగినట్లుగా చెప్పుకొచ్చింది. తాజాగా వార్షిక ప్రసంగంలో ట్రంప్ మాట్లాడుతూ ఆశ్చర్యకరమైన అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రాణాలు తానే కాపాడానంటూ చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపై ఇరు దేశాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.
