Russia- America: ఉక్రెయిన్- రష్యా యుద్ధం ప్రారంభమై నేటికి సుమారు మూడేళ్లు పూర్తి అవుతుంది. ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉక్రెయిన్లో శాంతి నెలకొల్పడానికి ఈ రోజు (ఫిబ్రవరి 18) సౌదీ అరేబియా వేదికగా కీలక సమావేశం జరగబోతుంది. అక్కడ అమెరికా- రష్యా విదేశాంగ మంత్రులు చర్చలు జరపనున్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలను మెరుగు పర్చుకోవడంతో పాటు ఉక్రెయిన్ అంశానికి ఎలా ముగింపు పలకాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ మధ్య ఫేస్ టూ ఫేస్ చర్చలకు ఈ భేటీ లైన్ క్లీయర్ చేయనుంది.
Read Also: Off The Record: ఆ మాజీ మంత్రి మళ్లీ సొంత గూటి వైపు చూస్తున్నారా..?
ఇక, ఈ సమావేశంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో పాల్గొనున్నారు. అమెరికా- రష్యా సంబంధాల పునరుద్ధరణపై చర్చలు జరగనున్నాయని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ తెలిపారు. అయితే, సౌదీలో జరిగే చర్చల్లో ఎలాంటి ఫలితం ఉండబోదని.. తాము దానిలో పాల్గొనేది లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ యూఏఈలో వెల్లడించారు. చర్చల్లో తీసుకునే నిర్ణయాలను ఆమోదించేది లేదని పేర్కొన్నాడు. కాగా, యుద్ధాన్ని ముగించే ఏ చర్చల్లోనైనా ఉక్రెయిన్ అధినేత భాగస్వామి అవుతారని డొనాల్డ్ ట్రంప్ చెప్పడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీంతో చర్చల కోసం జెలెన్స్కీ అబూధాబీ నుంచి రియాద్ వెళ్లే ఛాన్స్ ఉందని అందరు భావిస్తున్నారు.