పశ్చిమాసియాలో ఇరాన్ అత్యున్నత నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ మరణం ప్రపంచ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్పై ఇజ్రాయెల్ , అమెరికా జరిపిన భారీ వైమానిక దాడుల్లో ఖమేనీ మరణించడాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్రంగా ఖండించారు. ఈ దాడిని ఒక “నైతికతమానవత్వం లేని క్రూరమైన హత్య” (Cynical Murder) గా ఆయన అభివర్ణించారు. అంతర్జాతీయ నిబంధనలను తుంగలో తొక్కి, ఒక దేశ అత్యున్నత నాయకుడిని లక్ష్యంగా చేసుకోవడం భయంకరమైన పరిణామాలకు దారితీస్తుందని ఆయన హెచ్చరించారు.
ఈ దాడుల నేపథ్యంలో క్రెమ్లిన్ నుంచి విడుదలైన ప్రకటనలో పుతిన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సార్వభౌమాధికారాన్ని కాలరాయడమే కాకుండా, పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పే ప్రయత్నాలను ఈ దాడులు పూర్తిగా నీరుగార్చాయని ఆయన విమర్శించారు. ఒక దేశపు ఆధ్యాత్మిక , రాజకీయ నాయకుడిని హత్య చేయడం ద్వారా ఇజ్రాయెల్ , అమెరికా సంయుక్తంగా ఈ ప్రాంతాన్ని అదుపు చేయలేని యుద్ధంలోకి నెట్టాయని పుతిన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది కేవలం ఇరాన్పై జరిగిన దాడి మాత్రమే కాదని, ప్రపంచ స్థిరత్వంపై జరిగిన దాడిగా ఆయన పేర్కొన్నారు.
ఇరాన్-రష్యా మధ్య ఉన్న వ్యూహాత్మక సంబంధాల దృష్ట్యా, ఈ క్లిష్ట సమయంలో తాము ఇరాన్కు అండగా ఉంటామని పుతిన్ స్పష్టం చేశారు. మిత్రదేశ నాయకుడి మరణం రష్యాకు తీరని లోటని, ఇరాన్ ప్రజల సెంటిమెంట్లను తాము గౌరవిస్తామని ఆయన అన్నారు. ఇప్పటికే ఉక్రెయిన్ యుద్ధంతో రష్యా-అమెరికా మధ్య సంబంధాలు దెబ్బతిన్న తరుణంలో, తాజా పరిణామాలు రష్యాను అమెరికాకు మరింత శత్రువుగా మార్చే అవకాశం కనిపిస్తోంది. పశ్చిమ దేశాల ఏకపక్ష నిర్ణయాలు ఇకపై చెల్లవని, ఇరాన్ ప్రతీకార చర్యలకు దిగితే దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంటుందని రష్యా హెచ్చరించింది.
ఖమేనీ హత్యను పుతిన్ ఖండించడం ద్వారా రష్యా తన వైఖరిని స్పష్టం చేసింది. ఒకవైపు అమెరికా ఈ దాడులను సమర్థిస్తుండగా, రష్యా , దాని మిత్రదేశాలు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇది కేవలం ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పోరాటంగా కాకుండా, అగ్రరాజ్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధానికి (Proxy War) దారితీసేలా ఉంది. పుతిన్ వ్యాఖ్యలు ఇరాన్ సైనిక దళాల్లో మరింత ఆవేశాన్ని నింపే అవకాశం ఉందని, దీనివల్ల పశ్చిమాసియాలో మున్ముందు మరిన్ని భీకర దాడులు జరిగే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Munna Re-Release: ప్రభాస్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. ‘మున్నా’ ఈజ్ బ్యాక్!