Pakistan: మధ్యప్రాచ్యంలో గత నెల రోజులుగా కొనసాగున్న సంఘర్షణకు ఎండ్ కార్డ్ పడుతుందా.? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అమెరికా-ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధంతో మిడిల్ ఈస్ట్ అట్టుడుకుతోంది. అయితే, అమెరికా-ఇరాన్ మధ్య ‘‘కాల్పుల విరమణ’’, శాంతి చర్చలకు ఇస్లామాబాద్ వేదిక అవుతోంది. ఇదిలా ఉంటే, పాకిస్తాన్ ఇప్పుడు భారీ స్థాయిలో ఫైటర్ జెట్లు, నిఘా విమానాలును మోహరిస్తోంది. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఏకంగా ఒక పెద్ద ఆపరేషన్ ప్రారంభించింది. ఇందులో భాంగా జెఎఫ్-17, ఎఫ్-16 ఫైటర్ జెట్లను, అవాక్స్ విమానాలను, గాలిలోనే ఇంధనాన్ని నింపే ట్యాంకర్లను , సీ-130 ట్రాన్స్ పోర్ట్ విమానాలను మిడిల్ ఈస్ట్లో మోహరించింది.
Read Also: AP Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. 60కి పైగా ఎజెండా అంశాలకు ఆమోదం..
చర్చల్ని నాశనం చేయాలని ఇజ్రాయిల్ చూస్తోందని పాకిస్తాన్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంతో చర్చల కోసం వచ్చే ఇరాన్ ప్రతినిధుల రక్షణ కోసం పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఈ ప్రయత్నాలు చేస్తోంది. ఇజ్రాయిల్ ఏమైనా చేయొచ్చని పాకిస్తాన్లో భయాలు ఉన్నాయి. ఇరాన్ ప్రతినిధుల విమానాలకు పాకిస్తాన్ ఎస్కార్ట్ ఇవ్వబోతోంది. ఇరాన్ ప్రతినిధుల భద్రత కాపాడటంతో పాటు శాంతి చర్చల్ని ఎవరూ భంగం కలిగించకుండా పాకిస్తాన్ చూసుకుంటోంది.
1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత అతిపెద్ద స్థాయిలో పాకిస్తాన్లో చర్చలు జరగబోతున్నాయి. ఈ చర్చలు యూఎస్-ఇరాన్ మధ్య దశాబ్ధాల కాలంగా జరుగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు ఇవ్వొచ్చు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ చర్చలపై దృష్టి కేంద్రీకృతమైంది. మరోవైపు పాకిస్తాన్ తన ఇమేజ్ బిల్డప్ చేసుకోవడానికి ఈ చర్చల్ని ఉపయోగించుకోవాలని భావిస్తోంది. మరోవైపు, ఏ చిన్న ఘటన జరిగినా కూడా పాకిస్తాన్ పరువు మంటగలిసిపోతుంది. దీంతో పాకిస్తాన్ యూఏఈ, సౌదీ అరేబియా సహకారంతో ఈ భద్రతా చర్యల్ని చేపట్టింది.