CMRF Fraud : హైదరాబాద్లో సీఎంఆర్ఎఫ్ చెక్కుల గోల్మాల్ కేసు దర్యాప్తులో కొత్త పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో జూబ్లీహిల్స్ పోలీసులు ఆదివారం మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైనవారు పగడాల శ్రీనివాసరావు (22), యాస వెంకటేశ్వర్లు (50)గా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఈ కేసులో పెద్ద ఎత్తున అరెస్టులు జరిగాయి. సెప్టెంబర్ 19న జూబ్లీహిల్స్ పోలీసులు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో పొట్ల రవి, జంగమ నాగరాజు, మటేటి భాస్కర్, ధర్మారం రాజు, కాంపల్లి సంతోశ్, చిట్యాల లక్ష్మి, అసంపెల్లి లక్ష్మి ఉన్నారు. తాజా అరెస్టులతో కలిపి ఇప్పటివరకు ఈ కేసులో మొత్తం 19 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
దర్యాప్తులో పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, సీఎంఆర్ఎఫ్ చెక్కులను నకిలీ లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారని, ఆ మొత్తాన్ని విత్డ్రా చేసి అసలైన బాధితులను మోసం చేసినట్లు బయటపడింది. మొత్తం రూ. 8.71 లక్షలు అక్రమంగా విత్డ్రా చేసినట్లు గుర్తించారు. అలాగే 2023 ఎన్నికల తర్వాత 19 చెక్కులు నకిలీ ఖాతాల్లోకి మళ్లించబడినట్లు తేలింది. ఇప్పటివరకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఈ వ్యవహారంపై ఐదు కేసులు నమోదయ్యాయి.
ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడు నరేశ్కుమార్గా పోలీసులు గుర్తించారు. గత ప్రభుత్వంలో మాజీ మంత్రి హరీశ్రావు కార్యాలయంలో ఆయన పనిచేసినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ ఓటమి అనంతరం 230 సీఎంఆర్ఎఫ్ చెక్కులను తనతో తీసుకెళ్లిన నరేశ్, అందులో 19 చెక్కులను పక్కదారి పట్టించినట్లు దర్యాప్తులో బయటపడింది. ఇప్పటికే జులై 15న నరేశ్కుమార్తో పాటు వెంకటేశ్, వంశీ, ఓంకార్లను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న దర్యాప్తులో మరో ఇద్దరిని అదుపులోకి తీసుకోవడంతో కేసు మరింత మలుపు తిరిగింది.