మార్చి 31తో దేశవ్యాప్తంగా ప్రజలు కొన్ని పనులను పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కొన్ని పనులకు గడువు తేదీని పొడిగించింది. ఈ నేపథ్యంలో మళ్లీ గడువు తేదీని పొడిగించే పరిస్థితులు కనిపించడం లేదు. కావున మరో మూడురోజుల్లో గడువు ముగుస్తుంది కాబట్టి ఈ కింది పనులను పూర్తి చేయకుంటే ఇప్పుడే పూర్తి చేయండి.
★ 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి మార్చి 31తో గడువు ముగుస్తోంది. ఆ తర్వాత ఐటీ రిటర్నులను సమర్పించడం వీలుకాదు. అందువల్ల ఇంకమ్ట్యాక్స్ పరిధిలోకి వచ్చేవారు మార్చి 31లోగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయండి
★ ఆధార్ కార్డుతో పాన్ కార్డు లింకేజీని ఇంకా చాలా మంది ఉద్యోగులు పూర్తి చేయలేదు. ఆధార్తో పాన్ను అనుసంధానం చేసేందుకు ఈ నెలాఖరు వరకు గడువు ఉంది. గతంలో ఈ గడువును కేంద్ర ప్రభుత్వం మార్చి 31 వరకు పొడిగించింది. ఒకవేళ మార్చి 31లోగా మీరు ఆధార్-పాన్ లింక్ చేయకపోతే ఆర్థిక లావాదేవీలను నిర్వహించడం కష్టతరం అవుతుంది. అందువల్ల ఇప్పుడే ఆధార్-పాన్ లింకేజీని పూర్తి చేయండి. లేకపోతే రూ.10వేలు జరిమానా కట్టాల్సి రావొచ్చు.
★ మీ బ్యాంకు ఖాతాలో కేవైసీ పూర్తి చేయండి. పాన్, ఆధార్, అడ్రస్ ఐడెంటిటీల వివరాలను మార్చి 31లోగా సమర్పించండి. బ్యాంకు ఖాతాలో కేవైసీ పూర్తి చేయకుంటే మీరు చాలా ప్రయోజనాలను పొందలేరు. అందువల్ల ఈ పనిని మీ బ్యాంక్ శాఖకు వెళ్లి పూర్తి చేయండి.
★ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ యోజన పథకం ప్రయోజనాలను పొందాలంటే రైతులందరూ తప్పనిసరిగా మార్చి 31లోగా ఈ-కేవైసీ అప్డేట్ చేయాలి.
★ వివాద్ సే విశ్వాస్ పథకంలో భాగంగా పన్ను బాకీలను కూడా మార్చి 31లోగా చెల్లించండి. ఇలా చెల్లిస్తే వడ్డీతో పాటు అపరాధ రుసుములను రద్దు చేస్తామని ఆదాయపు పన్ను శాఖ ఇటీవల వెల్లడించింది. కనుక ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోండి.
★ తెలంగాణలో వాహనాల పెండింగ్ ఛలానాలపై ప్రకటించిన డిస్కౌంట్ మార్చి 31లోగా ముగియనుంది. దీంతో వాహనాలపై ఛలానాలు ఉన్నవారు ఇప్పుడే డిస్కౌంట్ ఉపయోగించుకుని చెల్లింపులు చేయండి.