సామాన్యులకు సొంతింటి కల మరింత ప్రియం కానుంది. తాజాగా ఏపీ, తెలంగాణలో మరోసారి సిమెంట్ ధరలు పెరిగాయి. ఈనెల 1 నుంచి సిమెంట్ బస్తాపై రూ. 20 నుంచి రూ. 50 వరకు ధర పెంచినట్లు సిమెంట్ కంపెనీలు వెల్లడించాయి. ప్రస్తుతం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 50 కిలోల బస్తా ధర బ్రాండ్ ఆధారంగా రూ.310 నుంచి రూ.400 వరకు పలుకుతోంది. సిమెంట్ ధరలు భారీగా పెరుగుతున్న కారణంగా ఇల్లు కట్టుకోవాలంటే పలువురు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.
Read Also: స్వల్పంగా పెరిగిన పసిడి ధర.. వెండి మాత్రం..?
గత ఏడాది నవంబర్ వరకు సిమెంట్కు డిమాండ్ తక్కువగా ఉండటంతో కంపెనీలు రేట్లను రూ.50 నుంచి రూ.70 వరకు తగ్గించాయి. ఈ ఏడాది జనవరి నుంచి డిమాండ్ పెరగడంతో పాటు ముడి పదార్థాల రేట్లు పెరగడంతో సిమెంట్ ధరలను పెంచినట్లు కంపెనీలు చెబుతున్నాయి. ఇప్పటికే ఇంటి నిర్మాణానికి కీలకమైన ఐరన్ ధరలు భారీగా పెరిగాయి. ఇప్పుడు సిమెంట్ ధరలు కూడా పెరగడంతో ఇంటి నిర్మాణం వ్యయం పెరిగిపోతుంది. దీంతో నిర్మాణ రంగంపైనా ప్రభావం పడుతోంది.