తెలంగాణకు పునర్జన్మనిచ్చింది కరీంనగర్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కరీంనగర్ ప్రజలు ఉద్యమ స్పూర్తి చూపకుంటే తెలంగాణ వచ్చేది కాదన్నారు. కరీంనగర్ జిల్లా అల్గునూర్లో దీక్షా దివస్ సభలో కేటీఆర్ ప్రసంగించారు. 1956 నుంచి 1968 వరకు తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. 1969 నుంచి తెలంగాణ ఉద్యమం మొదలయ్యిందన్నారు.
కేసీఆర్ 10 ఏళ్లలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా పేదలకు ఇవ్వలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. వచ్చే నెలలో ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభిస్తామన్నారు. 7 లక్షల కోట్లు అప్పు చేసి కాళేశ్వరం కడతా అని చెప్పి కూలిపోయే కాళేశ్వరం కట్టారని తీవ్రంగా విమర్శలు గుప్పించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు సాంకేతిక పరిజ్ఞానం అందించడానికి ఇజ్రాయెల్ సంసిద్ధత వ్యక్తం పట్ల ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హర్షం వ్యక్తం చేశారు. సచివాలయంలో తనను కలిసిన ఆ దేశపు రాయబారి రువెన్ అజర్కు ఆయన ఈ మేరకు కృతజ్ఞతలు తెలిపారు.
తోటి మనుషులను ప్రేమించాలని, కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవాలి పేదలకు చేయూతను అందించి పైకి తీసుకురావాలి.. సంఘంతో జీవించాలి అన్న క్రీస్తు బోధనలకు అనుగుణంగా ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వం కష్టాల్లో ఉన్న వారిని ఆదుకుంటూ, పేదలకు చేయూతనిస్తూ అభివృద్ధిలోకి తీసుకొస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన క్రైస్తవ ప్రతినిధుల సభలో ఆయన మాట్లాడారు.
సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ, రాజకీయ, కుల గణన సర్వే బుదవారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 95 శాతం పూర్తయింది. ఈ సమగ్ర ఇంటింటి సర్వేలో మొత్తం 1,18,02,726 నివాసాలను గుర్తించారు. బుధవారం నాటికి 1,10,98,360 నివాసాలలో సమాచార సేకరణ పూర్తవగా.. కేవలం 7,04,366 నివాసాల సర్వే సమాచారాన్ని మాత్రమే సేకరించాల్సి ఉంది.
జలసౌధలో ఉమ్మడి మెదక్ జిల్లా నీటిపారుదల ప్రాజెక్ట్లు, ఎత్తిపోతల పథకాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. సింగూరు, మంజీరాలకు గోదావరి జలాలు రానున్నాయని.. మహానగరానికి మంచినీటితో పాటు సేద్యంలోకి కొత్త ఆయకట్టు రానుందన్నారు.
హైదరాబాద్లోని అన్ని చెరువులపై పర్యవేక్షణ తమదేనని తెలంగాణ హైకోర్టు తెలిపింది. హెచ్ఎండీఏ పరిధిలోని చెరువుల ఎఫ్టీఎల్, బఫర్జోన్లను.. నిర్ధారించేవరకు పూర్తి పర్యవేక్షణ తీసుకుంటామని న్యాయస్థానం పేర్కొంది. డిసెంబర్ 30లోగా పూర్తి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
తెలంగాణ బీజేపీ పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు తెలంగాణలో ఎలా అమలు జరుగుతున్నాయనే దానిపై ప్రధాని అడిగి తెలుసుకున్నారు.
నిర్మల్ జిల్లా దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ అంశంపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. అబద్ధాల పునాదులతో అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తోందన్నారు. దిలావర్ పూర్-గుండంపల్లి మధ్యలో ఇథనాల్ ఫ్యాక్టరీపై కుట్ర జరుగుతోందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే ఇథనాల్ ఫ్యాక్టరీకి అన్ని రకాల అనుమతులు వచ్చాయని చెప్పారు.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించి పలు అనుమతుల కోసం మంత్రి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో రవాణా శాఖ వాహనాల రిజిస్ట్రేషన్లను వాహన్ పోర్టల్కు, డ్రైవింగ్ లైసెన్సులు సారథి పోర్టల్కు మార్చడం, వాహన స్క్రాపింగ్ సౌకర్యాల ఏర్పాటు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చిల్డ్రన్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్కుల ఏర్పాటు రోడ్డు భద్రత అవగాహన ప్రచారాలను నిర్వహించడం వంటి అనేక కార్యక్రమాలు చేపడుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర మంత్రికి తెలిపారు.