Yanamala: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీలోకి కొత్త రక్తం రావాలని.. దానిపై కసరత్తు జరుగుతుందని తెలిపారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. జగన్ క్రిమినల్ కాబట్టి.. ఆయన్ను కలవడానికి ఎవరైనా భయపడతారని.. చంద్రబాబు, పవన్ కలవాలి అంటే జగన్ అనుమతి తీసుకోవాలా అని నిలదీశారు. చంద్రబాబు, పవన్ భేటీతో తాము ఓడిపోతామనే భావనలోకి సీఎం జగన్ వెళ్లారని చురకలు అంటించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మంచి మిత్రులు అని యనమల స్పష్టం చేశారు.
Read Also: 2022 ఇండియాలో అత్యధికంగా అమ్ముడైన కార్లు ఇవే..
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలవకూడదని జగన్ రాజ్యాంగంలో ఉందా అని యనమల ప్రశ్నించారు. ప్రధాని మోదీని, అమిత్షాను జగన్ ఎందుకు కలుస్తున్నారని నిలదీశారు. పొత్తులనేది ఎన్నికల సమయంలో తీసుకునే నిర్ణయం అని.. జాతీయ పార్టీలు పొత్తులు పెట్టుకుంటుంటే.. ప్రాంతీయ పార్టీలు పెట్టుకోకూడదా అని సూటి ప్రశ్న వేశారు. 40 ఏళ్లుగా ఉన్న పార్టీతోనే ప్రజలకు న్యాయం జరుగుతుందని యనమల అన్నారు. చంద్రబాబు నాయకత్వం కోసం మళ్ళీ ఏపీ ప్రజలు ఎదురుచూస్తున్నారని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ 5 సొంత ఇళ్లు కట్టుకున్నారు.. 5 కోట్ల జనాభా ఉన్న ఏపీలో పేదలకు 5 ఇళ్ళు మాత్రమే కట్టారని ఎద్దేవా చేశారు.