Minister Kondapalli and MLA Ganta: మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్కు తృటిలో భారీ ప్రమాదం తప్పింది.. విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం కృష్ణాపురంలో MSME మీటింగ్కు హాజరయ్యారు మంత్రి కొండపల్లి, ఎమ్మెల్యే గంటా.. అయితే, ఒక్కసారిగా ఫొటోల కోసం కార్యకర్తలు, స్థానికులు ఎగబడటంతో కృష్ణాపురంలో MSME మీటింగ్ కోసం ఏర్పాటు చేసిన సభా వేదిక ఒక్కసారిగా కూలిపోయింది.. ఈ ఘటనలో మంత్రి కొండపల్లి శ్రీనివాసు, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు ప్రమాదం తప్పినట్టు అయ్యింది.. ఇక, కృష్ణాపురం గ్రామంలో MSME పార్క్ పనులకు 12 కోట్ల 40 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేశారు చిన్న పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు..
MSME పార్క్ ప్రారంభోత్సవంపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన గంటా శ్రీనివాసరావు.. పద్మనాభం మండలం కృష్ణాపురంలో MSME పార్క్ ను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తో కలిసి ఈరోజు ప్రారంభించాను. ఉత్తరాంధ్రలో ఇది మొదటి MSME పార్క్.. మొదటి దశలో 21.72 ఎకరాల్లో 163 ప్లాట్లుగా విభజించారు. మౌలిక సౌకర్యాలకు రూ.12.40 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఈ పార్క్ అందుబాటులోకి వస్తే వేలాది మంది గ్రామీణ ప్రాంత యువతకు ఉపాధి లభిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. ఇక, ఆ కార్యక్రమం ముగిసిన అనంతరం పాండ్రంగి బ్రిడ్జి పనులను పరిశీలించినట్టు ఎక్స్ (ట్విట్టర్)లో పోస్టు పెట్టారు మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు.