Solar Power Plants: ఆంధ్రప్రదేశ్లో 4,100 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఐదు సోలార్ పార్కులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది.. ఈ విషయాన్ని పార్లమెంట్ వేదికగా కేంద్రమే ప్రకటించింది.. ఇవాళ లోక్సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వల్లభనేని బాలశౌరి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి అడిగిన ప్రశ్నలకు కేంద్ర విద్యుత్తు, పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ఆర్కే సింగ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.. ఏపీలో 4,100 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఐదు సోలార్ పవర్ ప్లాంట్లకు ఆమోదం తెలిపినట్టు వెల్లడించారు. వీటిలో 1,400 మెగావాట్ల సామర్థ్యం కలిగిన అనంతపురం-1 సోలార్ పార్క్ పూర్తి అయ్యింది.. పూర్తి సామర్థ్యంతో విద్యుదుత్పత్తి జరుగుతోందన్నారు. 1,000 మెగావాట్ల సామర్థ్యంతో కర్నూల్ సోలార్ పార్క్ కూడా పూర్తి కావడంతో.. విద్యుదుత్పత్తి జరుగుతోందని వెల్లడించారు.
Read Also: Pawan Kalyan: ఎమ్మెల్యే ఆనం రక్షణ బాధ్యత డీజీపీదే..
ఇక, 1,000 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మాణం జరుపుకుంటున్న కడప సోలార్ పార్కులో ఇప్పటికే 250 మెగావాట్ల ఉత్పత్తి జరుగుతోందని వెల్లడించారు మంత్రి ఆర్కే సింగ్.. 500 మెగావాట్ల సామర్థ్యం గల అనంతపురం-2 సోలార్ పార్కులో 400 మెగావాట్ల ఉత్పత్తి జరుగుతోందని.. 200 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్, “విండ్ హైబ్రిడ్” పార్కు నిర్మాణం జరుగుతున్నట్టు పేర్కొన్నారు. మొత్తం ఆంధ్రప్రదేశ్లో 4,100 మెగావాట్ల సోలార్ పార్కులకు 3,050 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతోంది. నిర్మాణంలో ఉన్న పార్కులను పూర్తిచేయడం కోసం 2024 వరకు “సోలార్ పార్క్ పథకాన్ని” కేంద్రం పొడిగించినట్టు తన సమాధానంలో తెలిపారు కేంద్ర విద్యుత్తు, పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ఆర్కే సింగ్.