మాట నిలబెట్టుకున్న సునీల్ గవాస్కర్.. జెమిమా రోడ్రిగ్స్ తో కలిసి..!
టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్, భారత మహిళా క్రికెట్ స్టార్ జెమిమా రోడ్రిగ్స్ మధ్య జరిగిన ఓ సన్నివేశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదివరకు గవాస్కర్ ఇచ్చిన తన మాటను నిలబెట్టుకుంటూ జెమిమాకు ఒక ప్రత్యేకమైన బహుమతిని అందించడమే కాకుండా.. ఆమెతో కలిసి పాట పాడాడు. ఇందుకు సంబంధించి ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. గతంలో ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తూ సునీల్ గవాస్కర్ జెమిమాను కలిశారు. మహిళల వన్డే ప్రపంచకప్ గెలిస్తే ఆమెతో కలిసి మ్యూజిక్ జామింగ్ సెషన్లో పాల్గొంటానని గవాస్కర్ ప్రామిస్ చేశారు. ఈ సందర్భంగా గవాస్కర్ ఆమెకు బ్యాట్ ఆకారంలో ఉన్న ఒక కస్టమైజ్డ్ గిటార్ను (Bat-ar) బహుమతిగా ఇచ్చారు. గిఫ్ట్ ఇస్తున్న సమయంలో తాను ఈరోజు “ఓపెనింగ్ బ్యాట్” కాదంటూ సరదాగా వ్యాఖ్యానించారు.
బన్నీ ఫోన్ చేశాడు.. ప్రభాస్ ఫ్యాన్స్ ధైర్యం చెబుతున్నారు
ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ సినిమా జనవరి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ, ఒక రోజు ముందుగానే ప్రీమియర్స్ ప్రదర్శించారు మేకర్స్. సినిమాకు అయితే మిక్స్డ్ టాక్ వచ్చింది, కానీ మొదటి రోజు 112 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు సినిమా టీం ప్రకటించడమే కాదు, ఒక థాంక్యూ మీట్ కూడా నిర్వహించింది. ఈ క్రమంలోనే మీడియా ముందుకు వచ్చిన మారుతి మాట్లాడుతూ.. “ప్రభాస్ గారి ఫ్యాన్స్ తనకు, ‘మా అన్న సినిమాకి ఫస్ట్ ఇలానే ఉంటుంది, మీరు అసలు అలాంటివన్నీ పట్టించుకోవద్దు, పది రోజుల తర్వాత అన్న స్టామినా చూడండి’ అని నాకు మెసేజ్లు చేస్తున్నారు. అందుకని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే, ఒక నార్మల్ మిడ్-రేంజ్ డైరెక్టర్కి ప్రభాస్ సినిమా తీశాడు అనిపించేలా చేసిన ప్రభాస్ గారికి చాలా చాలా థాంక్స్. మా ఫ్రెండ్ బన్నీ వాసు కూడా నిన్న పొద్దున ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడాడు. దయచేసి నేను ఏమన్నా బాధ పడిపోతున్నాను అనుకోవద్దు” అని అన్నారు.
మేడారంలో మూడు ఆసుపత్రులు.. 30 మెడికల్ క్యాంపులు
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వచ్చే కోట్లాది మంది భక్తులకు వైద్యపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. చిన్నపాటి అనారోగ్య సమస్య వచ్చినా తక్షణం స్పందించి వైద్యం అందించేలా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ మేరకు శనివారం ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జాతర ఏర్పాట్లపై పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రూపొందించిన ప్రణాళికను మంత్రి పరిశీలించారు. ఇప్పటికే లక్షల మంది భక్తులు ముందస్తుగానే జాతరకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే గద్దెల వద్ద, జంపన్న వాగు సమీపంలో, ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద 3 వైద్య శిబిరాలను ప్రారంభించామని అధికారులు మంత్రికి వివరించారు. భక్తుల సంఖ్య పెరుగుతున్నందున జాతర పరిసరాలలో మరిన్ని మెడికల్ క్యాంపులను ముందస్తుగానే ప్రారంభించాలని అధికారులకు మంత్రి సూచించారు. భక్తులు మేడారం బయలుదేరిన దగ్గరి నుంచి.. అమ్మవార్లను దర్శించుకుని క్షేమంగా ఇళ్లకు చేరేంత వరకు వైద్య సేవలు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. మేడారం చేరుకునే అన్ని రూట్లలోనూ మెడికల్ క్యాంపులు ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు.
అమరావతిని జగన్ ఎప్పుడూ వ్యతిరేకించలేదు..
జగన్ రాష్ట్ర ప్రయోజనాలను కూటమి ప్రభుత్వం ఎలా దెబ్బ తీస్తుందనేది వైసీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు. చంద్రబాబు రాయలసీమ ప్రజల ఉసురు పోసుకుంటున్నారు. తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు చంద్రబాబు వద్ద సమాధానం లేదు.. జగన్ అమరావతిపై పలు ప్రశ్నలు సంధించారు.. రాజధాని నిర్మాణం కోసం తొలిదశ 50 వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు ఏమీ చేయలేదు.. ముందు ఇచ్చిన రైతులకు ఏమీ చేయకుండా రెండవ దశకు వెళ్ళటం తప్పు కదా అని ప్రశ్నించారు.. రైతులకు ఇస్తున్న రిటర్న్ ఫ్లాట్స్ కు కనీస మౌలిక సదుపాయాలు కల్పన లేదని సజ్జల అన్నారు.
పుతిన్ నా ఫ్రెండ్.. అలా చేయను.. ప్రెస్మీట్లో ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో కిడ్నాప్ తర్వాత విలేకర్ల సమావేశంలో ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మదురో మాదిరిగా పుతిన్ను కూడా భవిష్యత్లో కిడ్నాప్ చేస్తారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనికి సమాధానం ఇస్తూ.. రష్యా అధ్యక్షుడు పుతిన్తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని.. ఎప్పుడూ గొప్ప సంబంధం ఉంటుందని చెప్పారు. అయితే ఉక్రెయిన్తో యుద్ధం విషయంలో పుతిన్తో విసిగిపోయినట్లు తెలిపారు. ఇప్పటికే ఎనిమిది యుద్ధాలు ఆపానని.. కానీ రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని మాత్రం ఆపలేకపోయినట్లు చెప్పుకొచ్చారు. ఇది చాలా క్లిష్టమైందని తెలిసిందన్నారు. అయినా కూడా పుతిన్పై సైనిక చర్యలు చేపట్టనని స్పష్టం చేశారు. అయితే యుద్ధం ముగింపు విషయంలో మాత్రం రష్యాపై ఒత్తిడి కొనసాగిస్తానని తెలిపారు. ఈ రెండు దేశాల యుద్ధం వల్ల అనేక మంది చనిపోయారన్నారు.
ఒడిశాలో ఘోర ప్రమాదం.. చార్టర్డ్ ఫ్లైట్ కూలి
ఒడిశాలోని రూర్కెలా నుంచి భువనేశ్వర్కు వెళ్తున్న తొమ్మిది సీట్ల చార్టర్డ్ విమానం శనివారం మధ్యాహ్నం కూలిపోయింది. ఇండియావన్ ఎయిర్ యాజమాన్యంలోని ఈ విమానం రూర్కెలా నుంచి టేకాఫ్ అయి 17 కిలోమీటర్ల తర్వాత కూలిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ ఈ ప్రమాదంలో పైలట్ సహా తొమ్మిది మంది గాయపడ్డారు. వారిని వెంటనే స్థానికులు సమీపంలోని ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతానికి ఈ ప్రమాదానికి గల కారణం తెలియరాలేదు.
సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం మానేశా.. పెరిగిన ధరలకు నాకు సంబంధం లేదు..!
చాలా రోజుల తర్వాత హీరో ప్రభాస్ ను వెండితెరపై చూడడానికి అభిమానులు ఎగబడ్డారు. ఇది ఇలా ఉండగా.. సినిమా టికెట్ ధరలకు సంబంధించి అనేక విషయాలు ఇప్పుడు తెగ హాట్ టాపిక్ గా మారాయి. ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాకపోయినా.. తెలంగాణలో మాత్రం సినిమా ధరలతో సంబంధించి గవర్నమెంట్ ఆర్డర్ రావడం కాస్త ఆలస్యం అయ్యింది. అయితే అన్ని అడ్డంకులు ఎదుర్కొని చివరకు శుక్రవారం తెల్లవారుజామున 12 తర్వాత ప్రీమియర్ షోలు పడ్డాయి. ఇది ఇలా ఉండగా.. ప్రభాస్ నటించిన “ది రాజాసాబ్” సినిమా టికెట్ల ధరల పెంపునకు అనుమతినిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డర్ ను శుక్రవారం తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఈ అనుమతులు ఇచ్చారని న్యాయవాది విజయ్ గోపాల్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు, ప్రభుత్వ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
పూర్వ విద్యార్థులు సాయం చేస్తే.. ఏ కాలేజ్ ప్రైవేట్పరం చేయనవసరం లేదు..
ప్రతి ప్రభుత్వ కాలేజీకి పూర్వ విద్యార్థుల నుంచి సహకారం అందితే ఆ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాల్సిన అవసరం ఉండది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజ్ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రంగరాయ మెడికల్ కాలేజ్ దేశానికి అనేక మంది ఉత్తమ వైద్యులను అందించిందని, ఈ కాలేజ్ అందరికీ ఇన్స్పిరేషన్గా నిలవాలని పవన్ తెలిపారు. మూలాలు ఎంత బలంగా ఉంటే అదే స్థాయిలో భవిష్యత్తు కొనసాగుతుంది. ఈ కాలేజ్ నుంచి వచ్చిన పూర్వ విద్యార్థులు తమ వంతు బాధ్యతగా సహాయం చేస్తే ప్రభుత్వ కాలేజీలు మరింత బలోపేతం అవుతాయి అని ఆయన చెప్పారు.
సంక్రాంతి సంబరాల్లో ముగ్గు వేసిన మల్లారెడ్డి..
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు.. పల్లెల్లో, పట్టణాల్లో ముగ్గుల పోటీలతో సందడి నెలకొంటుంది. ఈ నేపథ్యంలో మేడ్చల్ నియోజకవర్గంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పూడూరు – కిష్టాపూర్ డివిజన్ పరిధిలోని కె.ఎల్.ఆర్ (KLR) ప్రాంతంలో బీఆర్ఎస్ నాయకుడు ఆకిటి నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళల కోసం భారీగా ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్లారెడ్డి, పండుగ వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చారు.
అయోధ్య రామాలయంలో నమాజ్.. తర్వాత ఏం జరిగిందంటే !
అయోధ్యలోని రామాలయంలో ఒక వ్యక్తి నమాజ్ చేసిన ఘటన సంచలనం సృష్టించింది. శనివారం ఒకరు ఆలయ సముదాయం లోపల నమాజ్ చేయడానికి ప్రయత్నిస్తుండగా పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని అబ్దుల్ అహ్మద్ షేక్గా పోలీసులు గుర్తించారు. ఆయన వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న ఆధార్ కార్డు ప్రకారం.. నిందితుడు జమ్మూ కాశ్మీర్లోని షోపియన్ నివాసి అని తెలిసింది.