ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య (88) పార్ధీవ దేహానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు.మరణవార్త తెలిసిన వెంటనే హైదరాబాద్లోని రోశయ్య నివాసానికి చేరుకుని రోశయ్య పార్థీవ దేహం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి, నివాళులర్పించారు.బాధలో ఉన్న వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసిఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. ఆర్థిక శాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా, గవర్నర్ గా పలు పదవులకు వన్నె తెచ్చిన వ్యక్తి రోశయ్య అని సౌమ్యుడిగా, సహన శీలిగా, రాజకీయాల్లో తనదైన ప్రత్యేక ముద్ర వేశారని సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.
మాజీ సీఎం కొణిజేటి రోశయ్య మృతికి రాష్ట్ర ప్రభుత్వం సంతాపం ప్రకటించింది. రోశయ్య అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. కేసీఆర్ ఆదేశాల మేరకు మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది. రోశయ్య పార్థీవ దేహానికి ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంత్యక్రియలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయాలని రంగారెడ్డి, హైద్రాబాద్ కలెక్టర్లకు రాష్ర్ట ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.