ఏపీలో భీమ్లా నాయక్ సినిమాపై ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో పవర్స్టార్ అభిమానులు మండిపడుతున్నారు. అదనపు షోలు ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేసిన అంశంపై ప్రభుత్వం, జనసేన కార్యకర్తల మధ్య వివాదం చెలరేగుతోంది. అయితే ఈ వివాదంపై టీడీపీ సీనియర్ నేత వర్లరామయ్య స్పందించారు. ఉద్దేశపూర్వకంగానే ఏపీ ప్రభుత్వం భీమ్లా నాయక్ సినిమాపై చర్యలకు దిగుతోందని టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శలు గుప్పించారు. ఒక సినిమా పట్ల జగన్ సర్కారు ఎందుకు ఇంతలా కఠినంగా వ్యవహరిస్తుందని ఆయన ప్రశ్నించారు.
ఇటీవల ఐదు షోలకు అనుమతి ఇస్తున్నట్లు ప్రభుత్వమే వెల్లడించిందని.. కానీ గతంలో ఎప్పుడూ లేని విధంగా భీమ్లా నాయక్ సినిమాకు ఐదు షోలు వేయకూడదని సినిమా హాళ్ల నోటీసులు ఇవ్వడంపై వర్ల రామయ్య అసహనం వ్యక్తం చేశారు. చూస్తుంటే ఈ సినిమా ఎవరూ చూడకూడదని కూడా ఆదేశాలిస్తారేమో అంటూ ఎద్దేవా చేశారు. దళితులు, మహిళల సమస్యలు ప్రభుత్వానికి పట్టవని, కానీ భీమ్లా నాయక్ సినిమా మాత్రం పెద్ద సమస్య అయిందా అంటూ ప్రభుత్వానికి చురకలు అంటించారు.