కష్టమంటే ఆదుకోవడంలో ముందుంటారు జనసేన అధినేత, పవర్ స్టార్ పవర్ కల్యాణ్.. ప్రకృతి విపత్తుల నుంచి సమయం, సందర్భం ఏదైనా.. నేనున్నానంటూ ముందుకు వస్తారు.. ఇప్పుడు ఆయన ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలపై ఫోకస్ పెట్టారు.. ఏపీలో రైతులు, కౌలు రైతులు పంట నష్టాలు… అప్పుల భారంతో ఆత్మహత్యలు చేసుకోవడం అత్యంత బాధాకరమని పేర్కొన్న ఆయన… అన్నపూర్ణ లాంటి గోదావరి జిల్లాల్లోనే 80మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారు అంటే సాగును నమ్ముకొన్నవారి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం అవుతోందన్నారు.. ఇక, ఉగాది పూట ఆ కుటుంబాలు దుఖంతో, బాధతో ఉండకూడదు… వారికి కొంతైనా ఊరటను ఇవ్వాలి అనే ఉద్దేశంతో జనసేన పక్షాన ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించామని.. ఒక్కో కుటుంబానికీ రూ.లక్ష రూపాయలు జనసేన ఆర్థిక సహాయం అందజేస్తుందని వెల్లడించారు.
ఆత్మహత్య చేసుకున్న ఆ రైతు కుటుంబాల్లోని పిల్లల చదువులకు, ఇతర అవసరాలకు కొంతైనా అండ ఇవ్వాలనే రూ.లక్ష సాయం చేస్తున్నామని ప్రకటించారు పవన్ కల్యాణ్.. త్వరలోనే ప్రతి కుటుంబాన్నీ పరామర్శిస్తాను.. ఆర్థిక సాయం అందించే ప్రక్రియ కూడా మొదలవుతుందన్నారు.. మనం ఈ రోజు తినే తిండి గింజల్లో 80శాతం కౌలు రైతుల కాయకష్టం వల్ల పండినవే. అలాంటి కౌలు రైతుల బాధల గురించి తెలుసుకొంటుంటే హృదయం ద్రవిస్తుంది.. కౌలు రైతుకు నిబంధనల పేరుతో ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందటం లేదు.. సాగు చేసుకొంటే రుణం ఇవ్వరు… పంట నష్టపోతే పరిహారం ఇవ్వరని ఆవేదన వ్యక్తం చేశారు.. ఆత్మహత్య చేసుకున్నవారికీ ఆర్థిక సాయం అందించడంలేదు.. కనీసం అధికారులు కూడా పరామర్శించి విచారించడంలేదని మండిపడ్డారు.. జనసేన పార్టీ రైతులు, కౌలు రైతుల పక్షాన నిలుస్తుందని ప్రకటించారు పవన్ కల్యాణ్.