ఉత్తరాంధ్ర గర్జన నేపథ్యంలో మంత్రులపై జరిగిన దాడి ఘటనలో అరెస్ట్అయినవారిని స్టేషన్ బెయిల్ ఇప్పించి బయటకు తీసుకొచ్చామని చెబుతున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. 13 మంది మినహా మిగతా అందిరికీ స్టేషన్ బెయిల్ వచ్చిందన్నారు.. ఇక, తన విశాఖ పర్యటనలో ఆంక్షలపై ఆగ్రహం వ్యక్తం చేశారు జనసేనాని.. ఇలాంటి ఆంక్షలు మళ్లీ విధించకుండా ప్రభుత్వాన్ని నియంత్రించేలా పోరాటం చేసేందుకు ఆయన సిద్ధం అవుతున్నారు. దీనిపై న్యాయ నిపుణులతో చర్చించనున్నారు.. ఇది ప్రభుత్వంపై పోరాటమే తప్ప.. పోలీసులపై కాదని స్పష్టం చేశారు పవన్ కల్యాణ్.
Read Also:Nama Nageswara Rao: ఎంపీ నామా నాగేశ్వరరావుకి ఈడీ షాక్.. ఆస్తులు జప్తు
విశాఖ నుంచి విజయవాడ బయల్దేరే సమయంలో.. పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. 115 మందికిపైగా జనసైనికులను అరెస్ట్చేశారు.. వారిపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఇక, 12 మందిని రిమాండ్కు పంపారు.. చాలా మందికి మా లీగల్ టీమ్ కష్టపడి బెయిల్ ఇప్పించింది… మిగతావారికి కూడా బెయిల్ ఇప్పించే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.. దీనిపై హైకోర్టుకు కూడా వెళ్తామన్నారు జనసేనాని.. మా పోరాటం పోలీసులపై కాదు.. ప్రభుత్వంపై పోరాటమని ప్రకటించారు.. తనను బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారని.. తాను తిరుగు ప్రయాణం అయిన సమయంలో.. కనీసం అభివాదం చేసేందుకు కూడా అవకాశం ఇవ్వలేదన్నారు.. నా అభిమానులు, జనసైనిలు చేసిన అభివాదాలకు.. నేను ప్రతిగా అభివాదాలు చేసే పరిస్థితి లేదంటే.. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంక్షల వల్లే అన్నారు.. ఇలాంటి ఆంక్షలు భవిష్యత్లో విధించకుండా ఉండేందుకు పోరాటం చేస్తామన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.