అమరావతిలో జరిగిన టీడీపీ అధినేత చంద్రబాబు పొలిట్ బ్యూరో సమావేశంలో కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పార్టీలో కష్టపడి పనిచేసిన వారికే అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. గతంలో ఈ సిద్ధాంతాన్ని పాటించలేక పోయామని కానీ ఈసారి దీనిని అమలు చేస్తామన్నారు. ఇక నుంచి పార్టీలో వలసలకు అవకాశం ఉండదన్నారు. ఎన్నికలకు ముందు వాసన పసిగట్టి పార్టీలోకి వచ్చే వారిని ఆహ్వానించేది లేదన్నారు. అధికార పార్టీ అనుసరిస్తున్న వ్యూహాలకు తగినట్టుగా పార్టీ బలోపేతం కావాలని, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు. మోజార్టీ ప్రజలు టీడీపీతోనే ఉన్నారన్నారు. ప్రజా సమస్యలపై పోరాడాలని కార్యకర్తలకు చెప్పారు.
టీడీపీ గతంలో చేసిన ప్రభుత్వ విధానాలను ప్రజలకు వివరించాలన్నారు. రాజధాని విషయంలో ప్రజలను చైతన్యం చేయడంతోపాటు వరద బాధితులకు అందే సాయం గురించి ప్రజలను అడిగి తెలుసుకోవాలన్నారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలతో పాటు పార్టీ నేతలు కృషి చేయాలన్నారు. రాష్ర్టంలో నెలకొన్న పరిస్థితులపై సమగ్రంగా ఈ సమావేశంలో చర్చించారు. భవిష్యత్లో టీడీపీ అనుసరించాల్సిన వ్యూహానికి సంబంధించి పార్టీ నేతలతో ఆయన చర్చించారు.