Kottu Satyanarayana: జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై మంత్రి కొట్టు సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పవన్ కళ్యాణ్ వైసీపీలోని కాపు వర్గీయులను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యల పట్ల మంత్రి తీవ్రంగా స్పందించారు. పవన్ కళ్యాణ్ చర్యలతోనే కాపు సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని మంత్రి కొట్టు సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో రాజమండ్రిలో ఈ అంశంపై కాపునేతలంతా సమావేశమై చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో కాపులపై పవన్ చేస్తున్న వ్యాఖ్యలపై, చర్యలపై చర్చిస్తామని వెల్లడించారు. చంద్రబాబు పార్టీని బతికించేందుకు పవన్ ప్యాకేజీ తీసుకుని పని చేస్తున్నారని మండిపడ్డారు. కాపులు పవన్తోనే ఉంటే కాపులు ఎక్కువగా నివసించే రెండు చోట్ల ఎందుకు ఓటమి ఎదుర్కొంటారని మంత్రి కొట్టు సత్యనారాయణ సూటిగా ప్రశ్నించారు. వైసీపీ కాపు నేతలపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ప్రజలు గమనిస్తున్నారని.. ఆయనకు సరైన సమయంలో ప్రజలు బుద్ధి చెబుతారని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు.
Read Also: Bandi Sanjay Kumar: ‘‘ఆ ఒక్కటీ అడక్కు’’ పోస్టర్లను విడుదల చేసిన బీజేపీ
కాగా వైసీపీలో ఉన్న కాపు నేతలపై ఇటీవల జనసేన కార్యకర్తల సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాపు కులం వైసీపీ కాపు నేతల దగ్గర లేదని, తన దగ్గర ఉందని పవన్ అన్నారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను వైసీపీలో ఉన్న కాపు నేతలు సీరియస్గా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 31న రాజమండ్రిలో వైసీపీ కాపు ప్రజాప్రతినిధులు భేటీ కానున్నారు. ఈ సమావేశానికి వైసీపీలో ఉన్న కాపు మంత్రులు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. పవన్ కళ్యాణ్ తీరుపై ఎలా స్పందించాలి? పవన్ కళ్యాణ్ను ఎలా కట్టడి చేయాలి? అనే విషయమై ఈ సమావేశంలో చర్చించనున్నారు.