విశాఖలోని శారదా పీఠం వద్ద మంత్రి అప్పలరాజుకు అవమానం ఎదురైంది. శారదా పీఠం వార్షికోత్సవం సందర్భంగా సీఎం జగన్ విశాఖ పర్యటనకు వచ్చారు. ఈ నేపథ్యంలో మంత్రి అప్పలరాజుతో పాటు పలువురు వైసీపీ నేతలు శారదా పీఠం వద్దకు చేరుకున్నారు. సీఎం రాక సందర్భంగా శారదాపీఠంలోకి మంత్రి అప్పలరాజు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. మంత్రి ఒక్కరే లోపలకు వెళ్లాలని, అనుచరులను లోపలకు పంపించబోమని సీఐ స్పష్టం చేశారు.
Read Also: Bonda Uma: సీఎం జగన్ ఇంటిని ముట్టడిస్తాం.. బోండా ఉమ హెచ్చరిక
ఈ సందర్భంగా మంత్రి అప్పలరాజు మాట్లాడుతుండగా… మీరు ఒక్కరే వెళ్తే వెళ్లండి.. లేకపోతే లేదు అంటూ ఆయన ముఖం మీదే సీఐ గేటు వేశారు. దీంతో షాకైన మంత్రి అప్పలరాజు ఆ కార్యక్రమంలో పాల్గొనకుండానే అక్కడి నుంచి అలిగి వెళ్లిపోయారు. అంతే కాదు మంత్రి అని కూడా చూడకుండా సీఐ దురుసుగా ప్రవర్తించారంటూ పోలీసు ఉన్నతాధికారులకు ఆయన ఫిర్యాదు చేశారు. భద్రతా సిబ్బంది అసభ్యపదజాలంతో మాట్లాడరని ఆరోపించారు. సంబంధిత అధికారిని పిలిపించి తనకు క్షమాపణలు చెప్పించాలని మంత్రి అప్పలరాజు డిమాండ్ చేశారు.