ఏపీ ప్రభుత్వంలో కొంతకాలం క్రితం వరకూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్ సవాంగ్ అనూహ్యంగా బదిలీ అయిన సంగతి తెలిసిందే. ఏపీ మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఈ రోజు ఖాకీ డ్రెస్ వదిలేశారు. ఎంచక్కా సూటు వేసుకుని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) చైర్మన్ బాధ్యతలు స్వీకరించారు. ఐపీఎస్ అధికారిగా గన్ పట్టుకునే చేతితో పెన్ పట్టుకుంటున్నారు. ఇంకా కొన్నాళ్ళ పాటు సర్వీసు ఉన్నప్టికీ సీఎం జగన్ అభ్యర్థన మేరకు ఆ సర్వీసును వదిలేసుకున్న సవాంగ్.. జగన్ కోరిక మేరకు ఏపీపీఎస్సీ చైర్మన్ పదవిని చేపట్టారు.
గురువారం విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో ఆ సంస్థ చైర్మన్గా సవాంగ్ పదవీ బాధ్యతలు చేపట్టారు. ఏపీపీఎస్సీ చైర్మన్గా ప్రమాణం చేసిన సవాంగ్కు వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు.ఏపీపీఎస్సీ సభ్యులు, అధికారులు, సిబ్బంది చైర్మన్ గౌతమ్ సవాంగ్ ని కలిసి అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. డీజీపీ గౌతమ్ సవాంగ్ బదిలీ వ్యవహారంలో విపక్షాలు తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ కూడా తగిన విధంగా బదులిచ్చింది. గౌతమ్ సవాంగ్ కి గౌరవప్రదమయిన పోస్ట్ ఇచ్చామని, బదిలీఅనేది సాధారణంగా జరిగేదే అని కౌంటర్ ఇచ్చారు మంత్రి కొడాలి నాని. ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా గౌతమ్ సవాంగ్ ఎలాంటి ముద్రవేస్తారోనని నిరుద్యోగులు అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ముఖ్యమంత్రి జగన్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. తనకు ఏపీపీఎస్సీ బాధ్యతలు ఇచ్చినందుకు సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు సవాంగ్.