Family doctor implements from august 15th in andhra pradesh: ఏపీలో వచ్చేనెల 15 నుంచి ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అమలు చేయనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజినీ వెల్లడించారు. మంగళగిరిలో సోమవారం నాడు వైద్య ఆరోగ్యశాఖపై అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామాలకు వెళ్లే వైద్యుల వద్ద ప్రతి రోగి ఆరోగ్య కార్డు ఉంటుందన్నారు. వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్, పీహెచ్సీలకు అనుబంధంగా ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలవుతుందని మంత్రి విడదల రజినీ చెప్పారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో సీజనల్ వ్యాధుల కట్టడికి ప్రత్యేక కార్యాచరణ అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. వ్యాధుల వల్ల మరణాలు సంభవించకూడదని ఆమె అధికారులకు సూచించారు.
Read Also: Vijayawada GGH Hospital:సదరం సర్టిఫికెట్ల కోసం దివ్యాంగుల తిప్పలు
రాష్ట్రంలో సీజనల్ వ్యాధులతో ఎవరైనా చనిపోయినట్లు తమ దృష్టి వస్తే అక్కడి వైద్య అధికారులపై చర్యలు ఉంటాయని మంత్రి విడదల రజినీ హెచ్చరించారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె హితవు పలికారు. ప్రజలకు ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందన్నారు. పారిశుధ్య చర్యలను మెరుగుపరిచేలా ఫాగింగ్ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దోమ తెరల పంపిణీకి సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి విడదల రజినీ సూచించారు. కాగా వైఎస్ఆర్ బీమా ఉండి చనిపోయిన వ్యక్తి కుటుంబానికి తక్షణ సాయంగా రూ.20వేలు అందించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం లబ్దిదారుల కుటుంబానికి హ్యాప్ పే కార్డులను అందజేయనుంది. ఇప్పటికే తిరుపతి జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాలకు ఈ కార్డులను చేరుస్తున్నారు. త్వరలోనే లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు.