Dharmana Prasad Rao: వికేంద్రీకరణ అంశంపై మంత్రి ధర్మాన ప్రసాదరావు కీలక కామెంట్లు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. అమరావతిలో సామాన్యులకు స్థానం ఉండదని ఆరోపించారు. క్యాపిటల్ అంటే యాక్సప్టబులిటీ ఉండాలని.. రవాణా సౌకర్యం ఉండి తీరాలని స్పష్టం చేశారు. విశాఖపట్నంలో ధనవంతుల జాబితా తీస్తే 100 మందిలో 99 మంది ఇతర ప్రాంతాల వారే ఉంటారన్నారు. ఉత్తరాంధ్రకు రాజ్యాంగబద్ధంగా ఆస్తులు, సంపదలు చేజారాయన్నారు. దేశంలో ఎక్కడ అభివృద్ధి జరిగినా క్యాపిటల్ చుట్టూ మాత్రమే జరిగిందని మంత్రి ధర్మాన అన్నారు. అభివృద్ధి కేంధ్రీకృతం అయితే సంపద పోగవుతుందని అభిప్రాయపడ్డారు.
ఇడుపులపాయలో రాజధాని పెట్టాలని సీఎం జగన్ చెప్పలేదని.. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడితే టీడీపీకి అభ్యంతరమేంటని మంత్రి ధర్మాన ప్రశ్నించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఆశపడి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని.. విశాలమైన ప్రజల ప్రయోజనాలే ధ్యేయంగా జగన్ ఆలోచన చేస్తున్నారని తెలిపారు. అవకాశం వచ్చిన సమయంలో కూడా కొందరు ఉత్తరాంధ్ర నేతలు నోరువిప్పడం లేదని ధర్మాన మండిపడ్డారు. కొందరు టీడీపీ నేతలు చంద్రబాబు ప్రాపకం కోసం పాకులాడుతున్నారని.. విశాఖ రాజధానిగా వద్దని చెప్పినా ఎవరైనా ద్రోహులే అన్నారు. టీడీపీ నేతల మనసులో ఉన్నా కూడా మాట్లాడలేకపోతున్నారని.. చంద్రబాబు స్వార్ధానికి ఎదురు మాట్లాడలేకపోతున్నట్లు తనకు తెలుస్తోందన్నారు.
Read Also: పండగ వేళల్లో బరువు పెరగొద్దంటే ఈ నియమాలు పాటించండి…
23 కేంద్ర సంస్థలలో ఒక్కటి కూడా ఉత్తరాంధ్రలో పెట్టలేకపోయారని మంత్రి ధర్మాన ఆరోపించారు. ఇప్పుడు మాట్లాడకపోతే ఇంకెప్పుడు మాట్లాడతారని నిలదీశారు. విశాఖకు రాజధాని వస్తే ఉత్తరాంధ్ర ముఖచిత్రం మారుతుందని ధర్మాన ఆశాభావం వ్యక్తం చేశారు. ధర్మాన ప్రసాదరావు నాయకుడు అయిపోతాడనే ఆలోచనలు చేయవద్దన్నారు. వచ్చే ఎన్నికల్లో అసలు తాను పోటీనే చేయకూడదని భావిస్తున్నానని మంత్రి ధర్మాన అన్నారు. ఉత్తరాంధ్ర నేతలు ఎవరికి వారు ముందుకు వచ్చి పోరాటం చేయాలని సూచించారు. ఉత్తరాంధ్ర ప్రజల పోరాటంతో పోలిస్తే తనకు మంత్రి పదవి గొప్పది కాదన్నారు. ప్రభుత్వం వికేంద్రీకరణకు మద్దతు ఇస్తోందని.. అందరూ కలిసి ముందుకు పోవాల్సిన అవసరం ఉందన్నారు.