టీడీపీ ఎమ్మెల్సీ అశోక్బాబుపై ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. గతంలో ఏసీటీవోగా పని చేసిన సమయంలో అశోక్బాబు తప్పుడు సమాచారం ఇచ్చారనే అభియోగాలపై కేసు నమోదు చేసినట్లు సీఐడీ అధికారులు వెల్లడించారు. తన సర్వీసు రికార్డు లేకుండానే అశోక్బాబు తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపించారు. బీకాం చదవకుండానే నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చారనే అభియోగంపై కేసు నమోదు చేశామన్నారు.
అశోక్బాబు తప్పుడు సమాచారం ఇచ్చి రికార్డులను ట్యాంపరింగ్ చేశారని సీఐడీ అధికారులు ఆరోపించారు. ఎన్నికల అఫిడవిట్లో కూడా డిగ్రీ చదివినట్లు పేర్కొన్నారనే అభియోగాల కింద కేసులు నమోదు చేశామని తెలిపారు. అశోక్ బాబుపై సెక్షన్ 477A, 465,420 కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. కాగా 2021లో అశోక్బాబుపై లోకాయుక్తలో కేసు నమోదు కాగా.. ఆ కేసును సీఐడీకి అప్పగించాలని లోకాయుక్త ఆదేశాలు జారీ చేసింది. దీంతో సీఐడీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.