Pawan Kalyan: మరోసారి తెలంగాణ రాజకీయాలపై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యా్ణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించిన పవన్.. అమరావతిలోని పొట్టి శ్రీరాములు స్మృతి వనంలోని మెమోరియల్ పార్క్ను సందర్శించారు.. పార్టీ సేవా గళం కమిటీ సభ్యులు, ఆర్యవైశ్య ప్రతినిధులతో కలిసి నివాళులు ఘటించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ అనుబంధ సంస్థగా ఇటీవల ఏర్పాటు చేసిన ‘సేవా గళం’ కమిటీకి సంబంధించిన దిశానిర్దేశం చేశారు. పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం కేవలం ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకే కాకుండా దేశంలో భాషా ప్రాతిపదిక రాష్ట్రాల ఏర్పాటుకు మార్గదర్శకంగా నిలిచిందని పవన్ కళ్యాణ్ అన్నారు. అలాంటి మహనీయుడిని ఒకే కులానికి పరిమితం చేయడం బాధాకరమని వ్యాఖ్యానించారు. ఆయన త్యాగం వల్లే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు బాటలు పడ్డాయని పేర్కొన్నారు.
తెలంగాణ భారతదేశంలో అంతర్భాగమే..
తెలంగాణలో తన రాజకీయ కార్యక్రమాలపై వస్తున్న విమర్శలు, వివాదాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ స్పందించారు. తెలంగాణ భారతదేశంలో అంతర్భాగమని, అక్కడికి వెళ్లడానికి ఎవరైనా స్వేచ్ఛగా రావచ్చని, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం సమాజానికి మంచిది కాదని అన్నారు. తెలంగాణకు వెళ్లడం లేదా అక్కడ సభలు నిర్వహించడం తప్పు కాదన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు ఉందని చెప్పారు. హైదరాబాద్ తన ఇల్లు అని, జనసేన పార్టీ కూడా అక్కడే ఆవిర్భవించిందని గుర్తుచేశారు. అలాంటప్పుడు తెలంగాణకు వెళ్లడానికి ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని ప్రస్తావిస్తూ, ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేయడం వేరని, కానీ ప్రజల మధ్య విభేదాలు సృష్టించడం వేరని పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు తెలుగువారి రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేశారని, అయితే ఆయన ఎప్పుడూ ఇతర ప్రాంతాల ప్రజలు రాకూడదని చెప్పలేదన్నారు. భౌగోళిక సరిహద్దులకు కంచెలు వేయవచ్చేమో కానీ మనుషుల మనసులకు కంచెలు వేయలేమని వ్యాఖ్యానించారు. తెలంగాణలో పుట్టి పెరిగిన నాయకులు సభలు నిర్వహిస్తే దానిని తప్పుగా చూడాల్సిన అవసరం లేదన్నారు. ఈ వివాదం చినికి చినికి గాలివానగా మారిందని, ఇందులో ఎలాంటి కుట్ర కోణం లేదని చెప్పారు. కొందరు నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు దేశ ప్రయోజనాలకు అనుకూలంగా లేవని అభిప్రాయపడ్డారు.
తెలంగాణ రాష్ట్రంపై తనకు అపారమైన ప్రేమ ఉందని పవన్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన కాంట్రాక్టర్లు తెలంగాణలో పనులు చేస్తుండగా, తెలంగాణకు చెందిన కాంట్రాక్టర్లు ఏపీలో పనిచేస్తున్నారని గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం అవసరమా అని ప్రశ్నించారు. తెలంగాణ రాజకీయ నేతల వ్యాఖ్యలపై స్పందిస్తూ, గద్దర్ ఎప్పుడూ ప్రాంతీయ విద్వేషాలను ప్రోత్సహించేలా మాట్లాడలేదన్నారు. గద్దర్ కుమార్తె తన వ్యాఖ్యలను పూర్తిగా అర్థం చేసుకోకుండా స్పందించి ఉండవచ్చని అన్నారు. అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో తనకు సోదర సంబంధం ఉందని, ఆయన ఏమన్నారో తాను చూడలేదని, తనకు తెలిసి ఆయన తప్పుగా మాట్లాడి ఉండరని వ్యాఖ్యానించారు.
ఈ వ్యవహారంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత్ర ఉండదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలు కావాలనే ఈ అంశాన్ని పెద్దదిగా చేసి ఉండవచ్చని భావిస్తున్నట్లు చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలు, ఇతర పార్టీ నాయకులు ఎన్నికల్లో పోటీ చేయవచ్చని, కానీ తాము తెలంగాణకు వస్తే అభ్యంతరాలు వ్యక్తం చేయడం సరికాదన్నారు. రాష్ట్ర విభజన జరిగి చాలా కాలం అయిందని, పుష్కరకాలం తర్వాత ప్రజల మధ్య ద్వేషాలు తగ్గిపోతాయని తాను భావించానని పవన్ చెప్పారు. అయితే కొందరు రాజకీయ నాయకులు ఇప్పటికీ ప్రాంతీయ భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం బాధాకరమన్నారు. యువతకు విభేదాల కంటే ఐక్యత, అభివృద్ధి, అవకాశాలపై సందేశం ఇవ్వాల్సిన అవసరం ఉందని సూచించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు పరస్పర గౌరవంతో ముందుకు సాగాలని, విద్వేషాలకు ముగింపు పలికి అభివృద్ధి దిశగా ఆలోచించాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.
తెలంగాణ అంటే నాకు అపారమైన ప్రేమ..
తెలంగాణ రాజకీయాలపై స్పందిస్తూ, తెలంగాణ రాష్ట్రంపై తనకు అపారమైన ప్రేమ ఉందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. ఇటీవల తన వ్యాఖ్యలపై వచ్చిన విమర్శల నేపథ్యంలో స్పందించిన ఆయన, ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ సభలు, సమావేశాలు నిర్వహించే హక్కు ఉందని చెప్పారు. రాజకీయ భేదాభిప్రాయాలు ఉండవచ్చు కానీ ప్రజాస్వామ్య హక్కులను అడ్డుకోవడం సరైన పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు. సమాజంలో కుల విభేదాలు తగ్గి సేవా భావం పెరిగితేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని, పొట్టి శ్రీరాములు చూపిన త్యాగ మార్గమే అందరికీ ఆదర్శమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
రాజకీయాల్లో కులాల ప్రాధాన్యం ఎక్కువైంది..!
రాష్ట్ర రాజకీయాల్లో కులాల ప్రాధాన్యం అధికమైందని పవన్ ఆందోళన వ్యక్తం చేశారు పవన్ కల్యాణ్. ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ వ్యక్తిని విమర్శించకుండా మొత్తం కులాన్ని లక్ష్యంగా చేసుకుని దూషించడం ప్రమాదకర ధోరణి అని అన్నారు. కుల అంశాలను అత్యంత సున్నితమైన రాజకీయ ఆయుధంగా మార్చేశారని వ్యాఖ్యానించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కుల రాజకీయాలు మరింత తీవ్ర స్థాయికి చేరాయని పవన్ ఆరోపించారు. జర్నలిస్టులను కూడా కులాల పేర్లతో దూషించే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ఈ విధానం కొనసాగితే ప్రజాస్వామ్య వ్యవస్థతో పాటు పరిపాలన కూడా ఇబ్బందులు ఎదుర్కొంటుందని హెచ్చరించారు.
అన్ని వర్గాలు ఓట్లు వేస్తేనే గెలుపు..
రాజకీయాలు ఏ ఒక్క కులంపైన ఆధారపడవని, అన్ని వర్గాల ప్రజలు ఓట్లు వేస్తేనే నాయకులు గెలుస్తారని పవన్ అన్నారు. అభివృద్ధి, ఉపాధి, నిరుద్యోగం, సంక్షేమం వంటి కీలక అంశాలపై చర్చ జరగాల్సిన సమయంలో కులాల చుట్టూ రాజకీయాలు తిరగడం దురదృష్టకరమన్నారు. ఈ పరిస్థితుల వల్ల ప్రజల్లో గందరగోళం పెరుగుతోందని, రాజకీయ నాయకుల వ్యాఖ్యలు సమాజంలో వైరుధ్యాలను పెంచుతున్నాయని చెప్పారు. పొట్టి శ్రీరాములు స్ఫూర్తితోనే జనసేన పార్టీ ‘సేవా గళం’ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువస్తోందని పవన్ తెలిపారు. కులాలకు అతీతంగా సమాజ సేవ చేయడమే ఈ కమిటీ ప్రధాన లక్ష్యమని వివరించారు. జనసేనలో వివిధ సామాజిక వర్గాలకు చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు ఉన్నారని, కుల రాజకీయాలకు ముగింపు పలకాలనే ఉద్దేశంతో పార్టీ ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు.

