YSRCP: వైఎస్ జగన్ శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం పర్యటనలో భద్రతా వైఫల్యంపై ఆందోళన వ్యక్తం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. హెలికాఫ్టర్ విండ్షీల్డ్ ధ్వంసం కావడంతో.. వైఎస్ జగన్ రోడ్డు మార్గంలో బెంగళూరు బయల్దేరి వెళ్లిన విషయం విదితమే కాగా.. జగన్ హెలికాప్టర్ విండ్షీల్డ్ ధ్వంసంపై ఆ పార్టీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది.. కుట్రపూరితంగానే పోలీస్ భద్రతను తొలగించారా? అని ప్రశ్నిస్తోంది.. వైఎస్ జగన్ భద్రతపై ప్రతిసారీ ఇదే నిర్లక్ష్యం అంటూ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు.. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ముందుగా సమాచారం ఇచ్చే జగన్ రామగిరికి వెళ్లారు.. మాజీ సీఎంకు కనీస భద్రత కల్పించాల్సిన బాధ్యత లేదా? ఆయన ప్రతి పర్యటనలోనూ పోలీసుల తీరు ఇదే రకంగా ఉంది.. కూటమి ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు జగన్ భద్రతను పట్టించుకోవడం లేదు అంటూ ఆరోపణలు గుప్పించారు..
Read Also: Arjun S/O Vyjayanthi: అర్జున్ సన్నాఫ్ వైజయంతి ‘బ్లాక్ బస్టర్’ సెన్సార్ రిపోర్ట్..
రామగిరిలో హెలికాఫ్టర్ విండ్షీల్ట్ ధ్వంసంపై పలు అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు లేళ్ల అప్పిరెడ్డి. ముందుస్తు సమాచారంతోనే జగన్ పర్యటించినా పోలీసులు కనీస బందోబస్త్ కూడా ఏర్పాటు చేయకపోవడం వెనుక కుట్ర ఉందా? అనే సందేహం కలుగుతోందని అన్నారు. ఇటీవల రామగిరి ఎంపీపీ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేతలు చేసిన దౌర్జన్యాలు, అరాచకాల నేపథ్యంలో పాపిరెడ్డిపల్లిలో వైసీపీ నేత కురుబ లింగమయ్య దారుణ హత్యకు గురయ్యాడు. ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ పాపిరెడ్డిపల్లికి వెళ్ళారు. ఆయన పర్యటనలో రాష్ట్రప్రభుత్వ వైఖరని, పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపించింది. హెలికాఫ్టర్లో జగన్ ఆ ప్రాంతానికి వెడితే, హెలిప్యాడ్లో నిలిచిఉన్న హెలికాఫ్టర్ విండ్ షీల్డ్ పగిలిపోయిందంటే పోలీసులు ఏ మేరకు భద్రత కల్పించారో అర్థం చేసుకోవచ్చు అన్నారు. రెండు రోజుల ముందే ఈ పర్యటన ఉంటుందని అన్ని ప్రభుత్వ విభాగాలకు సమాచారం ఇచ్చి, అనుమతులు తీసుకున్న తరువాతే హెలికాఫ్టర్లో అక్కడికి వెళ్ళారు. హెలిప్యాడ్కు భద్రత కల్పించాల్సిన పోలీస్ అధికారులు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మాజీ సీఎం, దేశంలోనే అత్యంత ప్రజాధరణ కలిగిన నాయకుడుగా జగన్ పర్యటనకు వెడుతుంటే ఏ మేరకు భద్రత కల్పించాలనే అంచనా పోలీస్ యంత్రాంగానికి లేదా? కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలోని నాయకుడికి కల్పించే భద్రత ఇదేనా? ఒక మాజీ సీఎంకే రక్షణ కల్పించలేకపోతే రాష్ట్రంలో సామాన్యులకు ఏం రక్షణ కల్పించగలరు? అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు..
Read Also: Pakistan: పాకిస్తాన్లో “అజ్ఞాత వ్యక్తుల” హల్చల్.. మసూద్ అజార్ బంధువు, కీలక టెర్రరిస్టు హతం..
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ వ్యక్తిగత భద్రతను, నివాసం వద్ద భద్రతను తగ్గించారు. ఆయన పర్యటనల సందర్బంగా పోలీసులు ఎక్కడా భద్రతా చర్యలను చేపట్టడం లేదు. చట్టాలను అనుసరించి పనిచేయాల్సిన పోలీసులు ఈ రాష్ట్రంలో కూటమి నేతల ఆదేశాల మేరకే పనిచేస్తున్నారని విమర్శించారు అప్పిరెడ్డి… ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతుంటాయి. వ్యవస్థలు మాత్రమే శాశ్వతంగా ఉంటాయి. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి లోబడి వ్యవస్థలు పనిచేయాలి. కానీ, ఏపీలో రాజ్యాంగానికి తూట్లు పొడుతూ, రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రభుత్వం, అధికారులు పనిచేస్తున్నారు. ఈ రోజు కూటమి అధికారంలో ఉందని, చట్టాలకు విరుద్దంగా వారు చెప్పినట్లే పనిచేస్తే, రాబోయే రోజుల్లో వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుంది. చట్ట విరుద్దంగా రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేసిన అధికారులు ఆరోజు చట్టం ముందు దోషులుగా నిలబడే పరిస్థితి వస్తుందన్నారు. మహానంది ప్రాంతంలో పర్యటకు వెళ్లినా, గుంటూరు మిర్చియార్డ్కు వెళ్లిన సందర్భంలోనూ ఒక్క పోలీస్ అధికారి కూడా భద్రతా ఏర్పాట్లలో కనిపించలేదు. చివరికి వైసీపీ శ్రేణులే జగన్ కి భద్రత కల్పిస్తూ రోప్ పట్టుకుని ముందుకు నడిచాయని తెలిపారు.. ఇక, విండ్షీల్డ్ డ్యామేజీ పైనా అనుమానాలు కలుగుతున్నాయి. కొందరు దుండగులు, అసాంఘికశక్తులు ఒక పథకం ప్రకారం జగన్ అభిమానుల ముసుగులో ఆయన పర్యటనలో పాల్గొని దాడులకు పాల్పడుతున్నారు. గతంలో కూడా ఇదే తరహాలో రెండు పర్యాయాలు జగన్ పై దాడి జరిగింది. జగన్ భద్రత కల్పించే విషయంలో రాష్ట్రప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేవారు వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి..