Adinarayana Reddy: ఆంధ్రప్రదేశ్లో కాకరేపుతోన్న లిక్కర్ స్కాం కేసులో సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వ విప్, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి.. లిక్కర్ స్కాం కేసులో మాజీ సీఎం వైఎస్ జగన్ జైలుకెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు.. రాష్ట్ర పరిస్థితి, లిక్కర్ స్కాంకు సంబంధించి మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయన్న ఆయన.. వైఎస్ జగన్ గత ఐదేళ్లలో చేసిన అప్పులు ప్రస్తుత రాష్ట్ర పరిస్థితికి అద్దం పడుతోందన్నారు.. అయినా, బీజేపీ సహకారంతో రాష్ట్రంలో అభివృద్ధి పనులకు కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టిందని వెల్లడించారు.
Read Also: CM Revanth Reddy: మీది 40 ఏళ్ల అనుభవం.. మీరు అండగా ఉంటే అద్భుతాలు చేస్తాం..
ఇక, వైఎస్ జగన్ జైలుకెళ్లడం, చిప్పకూడు తినడం తప్పదని వ్యాఖ్యానించారు ఆదినారాయణరెడ్డి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి రాక మానదని జోస్యం చెప్పారు.. లిక్కర్ కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి జైలు కెళ్లడం ఖాయం.. జైలుకెళ్లడం తప్పదని తెలిసే జగన్ నిత్యం మీడియా ద్వారా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు అంటూ సెటైర్లు వేశారు ప్రభుత్వ విప్, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. కాగా, లిక్కర్ స్కాం కేసుపై తాజాగా స్పందించిన వైఎస్ జగన్.. లిక్కర్ స్కాం అంటూ బేతాళ కథలు చెబుతూ.. అక్రమ కేసులు, అరెస్టులతో ప్రతీకార రాజకీయాలకు దిగారని మండిపడ్డిన విషయం విదితమే.. విద్యుత్ దగ్గరి నుంచి ఇసుక దాకా ప్రతీ దాంట్లోనూ స్కాం జరుగుతోందని, ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు వైఎస్ జగన్..