రెండేళ్లకు పైగా ఏపీ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ను సుప్రీంకోర్టు ఎత్తివేయడంతో మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు బుధవారం నాడు సచివాలయంలో విధుల్లో చేరారు. ఈ మేరకు జీడీఏలో రిపోర్టు చేశారు. అనంతరం ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. తాను సీఎస్ సమీర్ శర్మను కలవలేదని చెప్పారు. తన సస్పెన్షన్ను ఎత్తివేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు అసంపూర్ణంగా ఉన్నాయని ఆరోపించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకే తాను సీఎస్ సమీర్ శర్మను కలిసేందుకు ప్రయత్నించానని.. అయితే తనను కలిసేందుకు సమీర్ శర్మ విముఖత వ్యక్తం చేయడంతో జీఏడీలో రిపోర్ట్ చేశానని ఏబీ వెంకటేశ్వరరావు తెలిపారు.
తాను చట్ట ప్రకారం మాత్రమే ముందుకెళ్లానని.. ఏమైనా తప్పులుంటే బయటకు చెప్పాలి కదా అని ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. బెజవాడ సీపీగా ఉన్నప్పుడు ఇంటికెళ్లి ఎఫ్ఐఆర్ ఇచ్చామని.. గత ప్రభుత్వ హయాంలో తప్పుడు కేసులు పెడితే సరికాదని చెప్పేవాడినని పేర్కొన్నారు. 75 ఏళ్ల వయసులో మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డిపై ఎస్సీ,ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసేందుకు యత్నించిన పోలీసులను వారించినట్లు గుర్తుచేశారు. అయితే ప్రతిపక్షాలకు అనుకూలంగా ఉన్నానని తనపై అప్పట్లో కొందరు ఫిర్యాదులు కూడా చేశారని తెలిపారు. సీఎస్ సమీర్ శర్మ సర్వీస్ పొడిగించుకుని పదవిలో కొనసాగుతున్నారని.. కానీ తాను ఇంకా సర్వీసులోనే ఉన్నానని వెల్లడించారు.
Minister Karumuri: మీడియా తప్పుడు రాతలపై కోర్టును ఆశ్రయిస్తాం
పెండింగులో ఉన్న తన జీతం విషయం అడగాలని సీఎస్ను కలుద్దామని అనుకుంటున్నానని.. తన జీతం గురించి మాట్లాడేందుకు సీఎస్కు వచ్చిన ఇబ్బందేంటని ఏబీ వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. తాను కూడా ఆయన లాగే పరీక్షలు రాసి ఐపీఎస్ అయ్యానని తెలిపారు. చాలా మందిని వీఆర్లో ఉంచి జీతాలివ్వడం లేదన్నారు. ఎందుకు జీతాలివ్వడం లేదంటే కులం పేరు చెప్పి కొందరికి.. ఇంటెలిజెన్సులో పని చేశామని కొందరికి.. తన దగ్గర పని చేశారని మరి కొందరికి జీతాలివ్వడం లేదని చెబుతున్నారని.. ఈ విషయాలన్నీ సీఎస్కు చెప్పాలని భావించానన్నారు. జీతం ఇవ్వకుంటే హైకోర్టులో ధిక్కార పిటిషన్ వేయాలని సూచించారు. తనపై వచ్చిన ఆరోపణలు నిజం కాదని సుప్రీం కోర్టు తీర్పుతో స్పష్టమైందని పేర్కొన్నారు. రిపోర్ట్ చేయడం వరకే తన పని అని.. పోస్టింగ్ విషయం ప్రభుత్వ పరిధిలోనే ఉంటుందన్నారు. తనకు ఏం పోస్టింగ్ ఇస్తారో తనకే తెలియదని.. పోస్టింగ్ ఇవ్వకుంటే జీతం ఇచ్చి తనను ఖాళీగా అట్టిపెట్టినట్టేనని.. అంతేకాకంఉడా ప్రజాధనం వృధా అయినట్టేనని ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు.