హైదరాబాద్ నగరంలో ఇటీవల కాలంలో పలువురు యువకులు మత్తుకు బానిసై దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. తాజాగా మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీజేఆర్ నగర్, మల్లికార్జునా నగర్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… స్థానికంగా నివాసం ఉండే నవీన్ అనే యువకుడికి అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ప్రేమ పేరుతో ఆ యువతి వెంటపడ్డాడు. నవీన్ మత్తుకు బానిసై చిల్లరగా తిరుగుతూ తన కూతురు వెంటపడుతున్నాడని యువతి తల్లిదండ్రులు గమనించారు. దీంతో నవీన్ను వారు మందలించారు.
Read Also: భాగ్యనగర వాసులకు.. జలమండలి కీలక సూచనలు
దీంతో కక్ష పెంచుకున్న నవీన్ వాళ్ల అంత చూస్తానని హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో యువతి ఇంటిని ఎవరు లేని సమయంలో పెట్రోల్ పోసి తగులబెట్టాడు. ఈ ఘటనలో బాధితుల ఇంటితో పాటు ఇంట్లో ఉన్న వస్తువులన్నీ మంటల్లో కాలి బూడిదయ్యాయి. ఈ ఘటనపై బాధితులు జవహర్ నగర్ పోలీసులను ఆశ్రయించగా స్పాట్ కు చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టి కేసు నమోదు చేశారు. వెంటనే నిందితుడు నవీన్ను అదుపులోకి తీసుకుని రిమాండ్ నిమిత్తం చర్లపల్లి జైలుకు తరలించారు. కాగా నవీన్ గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటై చిల్లరగా తిరుగుతుంటాడని స్థానికులు ఆరోపిస్తున్నారు.