తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య జల జగడం కొనసాగుతూనే ఉంది.. రెండు రాష్ట్రాల మధ్య నీటి వాటాను 50:50 శాతంగా పంచాలని డిమాండ్ చేస్తోంది తెలంగాణ సర్కార్.. అయితే, తెలంగాణ కోరుతున్న 50:50 శాతం నీటి కేటాయింపులు పగటి కలే అని వ్యాఖ్యానించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి.. కేఆర్ఎంబీకి లేఖ రాసినట్లు 70:30 శాతం నీటి కేటాయింపులు గతంలోనే చేశారన్న ఆయన.. రాష్ట్ర విభజన సమయంలో రెండు రాష్ట్రాలు చేసుకున్న ఒప్పందం 70:30 ప్రకారమే ముందుకు వెళ్లాలని స్పష్టం చేశారు.. దీనిలో కొత్త వాదన ఏమీ లేదన్న ఆయన.. అంగీకరించిన విషయాన్ని తెలంగాణ ప్రశ్నించటం అసంబద్ధం అన్నారు.
మరోవైపు.. టీడీపీకి ఈ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదని మండిపడ్డారు సజ్జల… వారి హయాంలో ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ ఘోరంగా విఫలమైందన్న ఆయన.. మా ప్రభుత్వం వచ్చిన తర్వాతే దళితులు, మహిళలపై దాడులు అరికట్టడానికి సమగ్ర ప్రణాళిక రూపొందించాం అన్నారు.. మహిళల భద్రత గురించి చంద్రబాబు ఎప్పుడైనా పట్టించుకున్నారా? అని ప్రశ్నించిన ఆయన.. రిషితేశ్వరి కేసు ఇప్పటికీ కొలిక్కి రాలేదు.. ఎస్సీల పై రిపోర్ట్ కాని దాడులు , లెక్కలేనన్ని టీడీపీ హయాంలో జరిగాయని ఆరోపించారు. రమ్య ఘటన పై ఎస్సీ జాతీయ కమిషన్ వైస్ ఛైర్మన్ ప్రభుత్వం వందకు రెండు వందల శాతం పని చేసిందని ప్రశంసించారని ఈ సందర్భంగా వ్యాఖ్యానించిన ఆయన.. దిశ చట్టం ఇంకా కేంద్రం దగ్గరే ఉందన్నారు.. మహిళల భద్రత కోసం దిశ లాంటి చట్టం తీసుకు రావాలన్న ఆలోచన అయినా చంద్రబాబు, లోకేష్ చేశారా? అని నిలదీశారు. గతంలో దేవాలయాలపై దాడులు అంటూ క్యాంపైన్ చేశారు… ఇప్పుడు దళితుల అంశాన్ని రాజకీయం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి.