ఏపీ ప్రభుత్వం తీరుపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ తో ఉద్యోగ సంఘాల ప్రతినిధుల సమావేశం ముగిసింది. అనంతరం ఏపీ జేఏసీ ఛైర్మన్ బండి శ్రీనివాసరావు మాట్లాడారు. వెంటనే పీఆర్సీ నివేదికను బయటపెట్టాలని కోరామన్నారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లోని సభ్య సంఘాల మెంబర్ షిప్ వివరాలు కూడా కోరాం. సీఎంఓ అధికారులతో పీఆర్సీ నివేదికపై చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు.
పీఆర్సీ నివేదికను ఇప్పుడే ఇవ్వలేమని శశిభూషణ్ చెప్పారు. నా చేతుల్లో ఏం లేదు.. సీఎం, సీఎస్ చేతుల్లోనే అంతా ఉందని శశిభూషణ్ స్పష్టంగా చెప్పారు. రెండు జేఏసీలు కలిసినప్పుడు వెంకట్రామిరెడ్డిని కూడా మాతో కలవాలని కోరాం. భేషజాలు పక్కన పెట్టాలని కోరాం. మా మీద ఏ ఆరోపణలు చేసినా మేం స్పందించాల్సిన అవసరం లేదు. మేం మా దారి తప్పం.. కలిసి రావాలని వెంకట్రామిరెడ్డిని కోరుతున్నాం.
పీఆర్సీ నివేదిక ఇవ్వడానికి కూడా ప్రభుత్వం మీన మేషాలు లెక్కిస్తోందంటే మాకు అనుమనాలు వస్తున్నాయి. ప్రభుత్వమే చంద్రశేఖర్ రెడ్డికి సలహాదారు పదవి ఇచ్చింది. పీఆర్సీ నివేదికను ప్రభుత్వం ఎందుకు దాచిపెడుతుందో అర్ధం కావడం లేదన్నారు ఏపీ అమరావతి జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు. పీఆర్సీ నివేదికను మేమూ స్టడీ చేయాలి. మా డిమాండ్లు ఆ నివేదికలో ఉందో లేదో మాకూ తెలియాలి కదా..?
పీఆర్సీని వెంటనే అమలు చేసే ఆలోచన ప్రభుత్వానికి ఉందా..? లేదా..? రేపటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో పీఆర్సీ గురించే ప్రధానంగా ప్రస్తావిస్తాం. వెంకట్రామిరెడ్డి కూడా మా సోదరుడే.. ఉద్యోగుల కోసమే మా ప్రయత్నం. పెద్ద జేఏసీలుగా ఉన్న మేం ఏకమై పీఆర్సీ కోసం ఉద్యమిస్తున్నాం కాబట్టి.. పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరేం విమర్శలు చేసినా మేం పట్టించుకోం. పీఆర్సీ వ్యవహరాన్ని పక్క దారి పట్టించేలా వెంకట్రామిరెడ్డి ప్రయత్నిస్తున్నారు. వెంకట్రామిరెడ్డి ఏదో లబ్దిని ఆశించే పక్క దారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు బొప్పరాజు.