తమ డిమాండ్ల సాధనకు వివిధ రూపాలలో ప్రజలు, నేతలు నిరసన వ్యక్తం చేయడం ఆనవాయితీ. కలెక్టరేట్ల ముందు ఆందోళన చేపడతారు. రోడ్లపై రాస్తారోకో చేస్తారు. దీక్షలో కూర్చుని తమ డిమాండ్ల సాధనకు అధికారులు, నేతలపై వత్తిడి తెస్తారు. తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో ఓ ఊరిజనం వినూత్నంగా నిరసన తెలిపి అందరినీ ఆకట్టుకున్నారు.
పెంబి మండలంలో యాపలగూడా గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేదు. ఊరినుంచి బయటకు వెళ్ళాలంటే నానా ఇబ్బందులు పడుతున్నారు జనం. రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఎప్పటినుంచో అధికారులు, ప్రజాప్రతినిధుల వెంట పడ్డారు. వినతిపత్రాలు ఇచ్చారు. చివరకు అధికారులు స్పందించకపోవడంతో తాజాగా తమదైన రీతిలో నిరసన తెలిపారు. గ్రామస్తులంతా ఏకమై దొత్తి వాగు నీళ్ళలో మోకాళ్లపై నిరసనకు దిగారు. ‘‘కావాలి.. కావాలి మాకు రోడ్డు కావాలి.. మా ఊరికి రోడ్డు కావాలి’’ అంటూ నీళ్ళలో మోకాళ్ళపై నిలబడి నినదించారు.
గ్రామం ఏర్పడి 50 సంవత్సరాలు గడుస్తున్నా ఎన్నో ప్రభుత్వాలు మారినా రోడ్డు మారలేదు. గతుకుల రోడ్డుతో ఇబ్బందులు పడుతున్నామని, మా బ్రతుకులు మారడం లేదని దొత్తి వాగులో నిరసన చేస్తూ వచ్చే ఎన్నికల్లో ఓటు వేయమని మోకాళ్లపై నిరసన చేస్తూ నిరసన చేశామన్నారు. దొత్తి వాగు చుట్టూ 3 గ్రామ పంచాయితీలు, 12 గ్రామాలు సుమారు 2500 మంది జనాభా వున్నారు. ప్రతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
ఎన్నికల ప్రచారానికి వచ్చిన నాయకులకు వాగు బ్రిడ్జి గురించి చెబుతున్నారు. ఎన్నికలలో హామీ ఇస్తున్నారు. కానీ ఎన్నికలు అయ్యాక అన్నీ మరచిపోతున్నారు. వర్షాకాలం వస్తే మా ఊరు తప్ప ఎటు వెళ్లలేకపోతున్నామని, ఒకవేశ పనులకు బయటకు వెళితే అంతలో వాగు వస్తే పెంబి లొనే పడుకుంటామని అంటున్నారు. పిల్లలను చదువులకు పంపాలన్న కష్టంగా మారిందన్నారు. రోడ్డు లేకపోవడం వల్ల ఆడపిల్లలకు పెళ్లిళ్ళు కావడం లేదని, మా మగపిల్లలకు ఆడపిల్లలను ఇవ్వడం లేదని గ్రామస్తులు తెలిపారు.
వాగు వచ్చినప్పుడు బాలింతలు చాలా ఇబ్బంది పడుతున్నారు. జ్వరాలు వస్తే దేవుడి పై భారం పెడుతున్నామని, అనేకమంది మరణించిన వారు కూడా ఉన్నారని చెబుతున్నారు. వాగులో కొట్టుకుపోయిన వారు కూడా ఉన్నారని గ్రామస్తులు దేవ్ రావ్, రాజవ్వ అన్నారు. మా గ్రామాలకు రోడ్ వెయ్యక పోతే వచ్చే ఎన్నికల్లో ఎవరికీ ఓటు వేయమని గ్రామస్తులంతా ముక్తకంఠంతో చెబుతున్నారు.