గత రెండు రోజులుగా బీజేపీ చీఫ్ బండి సంజయ్ను అరెస్ట్ చేయడం పట్ల రాజకీయ దుమారం రేగిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ల మధ్య రాజకీయ డ్రామా నడుస్తోందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ గౌడ్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ, టీఆర్ఎస్ల లోపాయికారీ ఒప్పందంలో భాగంగానే రాష్ట్రంలో రచ్చ చేస్తున్నాయన్నారు.
అరెస్ట్ చేయాల్సిన అవసరం లేకున్నా.. సంజయ్ నీ అరెస్ట్ చేశారని, నడ్డాను కూడా అరెస్ట్ చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోందని ఆయన అన్నారు. లేని బీజేపీ పార్టీనీ కేసీఆర్ హైప్ చేస్తున్నారని, కాంగ్రెస్ పెరుగుదల జీర్ణించుకోలేక కేసీఆర్, బీజేపీ డ్రామాలు చేస్తోందన్నారు. టీఆర్ఎస్ వ్యతిరేక ఓటు చీల్చి లబ్ది పొందే కుట్ర చేస్తుందని ఆయన అన్నారు.