రాజధాని రైతుల పాదయాత్రలో లాఠీ ఛార్జ్ అప్రజాస్వామికం అన్నారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. రైతుల పాదయాత్రలో గాయాల పాలైనవారికి.. చేయి విరిగిన రైతుకు వైద్యం బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులు చేపట్టిన పాదయాత్రకు సంఘీభావం తెలియచేసేందుకు వచ్చిన వారిపై లాఠీ ఛార్జ్ చేయడం దురదృష్టకరం.
మద్దతు చెప్పడం, సంఘీభావం తెలియచేయడం ప్రజాస్వామ్యంలో భాగమే. అదేమీ నేరం కాదు. రైతులు చేపట్టిన కార్యక్రమానికి సంఘీభావాన్ని చెప్పేవారిని అడ్డుకోవడం అప్రజాస్వామిక చర్య అన్నారు మనోహర్. రోడ్లను దిగ్బంధించి, చెక్ పోస్టులు ఏర్పాటు చేసి కట్టడి చేయాల్సిన అవసరం ఏమిటి? ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడంతోపాటు రైతుల యాత్రను విఫలం చేయడానికే ప్రభుత్వం ఇలాంటి చర్యలకు దిగుతోందని దుయ్యబట్టారు నాదెండ్ల మనోహర్.