తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. రెండు మంగళవారాల్లో 11 వేల మందికి స్క్రీనింగ్ నిర్వహించినట్లు తెలిపారు. మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. మహిళల సంపూర్ణ ఆరోగ్యం కోసం సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న “ఆరోగ్య మహిళ” కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని చెప్పారు. మొదటి మంగళ వారం (ఈనెల 14న) 4,793 మంది మహిళలకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించగా, ఇందులో 975 మందికి అవసమైన మందులు అందజేశారని తెలిపారు. ఉన్నత స్థాయి వైద్యం అవసరం ఉన్నవారిని, సమీపంలోని రిఫెరల్ సెంటర్ అయిన పెద్దాసుపత్రికి తీసుకువెళ్ళి వైద్యం సేవలు అందేలా చూస్తున్నారని మంత్రి చెప్పారు.
Also Read:Rain Alert: మరో రెండు రోజుల పాటు వర్షాలు.. ఆ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ
మహిళల కోసం ప్రత్యేకంగా ఒకరోజు కేటాయించి వైద్య సేవలు అందిస్తుండటం పట్ల మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఆరోగ్య సమస్య ఉన్నప్పటికీ, కుటుంబ సభ్యులకు చెప్పుకోవడం ఇష్టం లేక కొందరు, వ్యాధి లక్షణాల పై అవగాహన లేక మరికొందరు, వ్యయ ప్రయాసలు ఓర్చే పరిస్థితి లేక మరికొందరు ఇబ్బంది పడ్డారని మంత్రి హరీశ్ రావు చెప్పారు. ఇప్పుడు అలాంటి వారు ఆరోగ్య మహిళ కేంద్రాలకు వెళ్లి ఉచితంగా వైద్యం, పరీక్షలు, మందులు పొందుతున్నారని వెల్లడించారు. రెండో మంగళ వారం (ఈనెల 21న) 6,328 మంది మహిళలు ఆరోగ్య మహిళ క్లినిక్స్ ను సందర్శించారని తెలిపారు.వీరిలో 3753 మందికి రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు, 884 మందికి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు, 3783 మందికి నోటి క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు, 718 మందికి మూత్రకోష ఇన్ఫెక్షన్ల నిర్ధారణ పరీక్షలు, 1029 మందికి సూక్ష్మ పోషక లోప నిర్ధారణ పరీక్షలు, 777 మందికి థైరాయిడ్ పరీక్షలు, 477 మందికి విటమిన్ – డి లోప పరీక్షలు, 1294 మందికి సిబిపి పరీక్షలు నిర్వహించారని వివరించారు.
Also Read:TSPSC Paper Leakage: టీఎస్పీఎస్సీ సిబ్బందికి సిట్ నోటీసులు.. కోచింగ్ సెంటర్లపై నిఘా!
కాగా, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వైద్యారోగ్య శాఖ ప్రత్యకంగా ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని చేపట్టింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8వ తేదీన వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కరీంనగర్లో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. మొదటి దశలో రాష్ట్రవ్యాప్తంగా 24 జిల్లాల్లో 100 కేంద్రాల్లో వైద్య సేవలు మొదలయ్యాయి. దశల వారీగా 1200 కేంద్రాలకు విస్తరించనున్నారు. ఈ కేంద్రాల్లో ప్రతి మంగళవారం ప్రత్యేకంగా మహిళలకే 8 రకాల వైద్య సేవలు అందిస్తున్నారు.