ఆంధ్రప్రదేశ్లో ఎయిడెడ్ సంస్థల విలీనం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. సూచనలతో అంతర్గత మెమో జారీ చేసింది ఏపీ ఉన్నతవిద్యా శాఖ. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఎయిడెడ్ సంస్థల విలీనం విషయంలో జరుగుతోన్న ఆందోళనలతో తాజా మెమో జారీ చేసింది సర్కార్. 2249 ఎయిడెడ్ విద్యా సంస్థల్లో 68.78 శాతం విద్యా సంస్థలు విలీనానికి అంగీకరించాయని ప్రభుత్వం తెలిపింది.
702 ఎయిడెడ్ విద్యా సంస్థలు విలీనానికి అంగీకరించలేదని స్పష్టీకరించింది. విలీనానికి అంగీకరించని ఎయిడెడ్ సంస్థలపై ఎలాంటి ఒత్తిడి పెట్టలేదని స్పష్టం చేసింది ఉన్నత విద్యా శాఖ. విలీనానికి నాలుగు ఆప్షన్లను ఎయిడెడ్ విద్యా సంస్థలు ముందున్నాయన్న ఉన్నత విద్యా శాఖ తెలిపింది.
ఆప్షన్-1: ఆస్తులు, ప్రస్తుతం పని చేస్తున్న సిబ్బందితో సహా విలీనానికి సుముఖత.
ఆప్షన్-2: ఆస్తులు మినహా ఎయిడెడ్ సిబ్బందిని ప్రభుత్వానికి సరెండర్ చేయడానికి అంగీకరించి ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూళ్లుగా కొనసాగే అవకాశం.
ఆప్షన్-3: ఏ రకమైన విలీనానికి సుముఖత కనబర్చకుండా ప్రైవేట్ ఎయిడెడ్ విద్యా సంస్థలుగా కొనసాగడం.
ఆప్షన్-4: గతంలో విలీనానికి తెలిపిన అంగీకారాన్ని వెనక్కు తీసుకునే అవకాశం.
ఈ ఆప్షన్లను కచ్చితంగా పాటించాలని అధికారులకు ప్రభుత్వం సూచనలు చేసింది. ఎయిడెడ్ విద్యాసంస్థల్ని బలవంతంగా విలీనం చేసుకుంటోందని ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ప్రభుత్వం మెమో జారీచేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.