గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి.. ఈ విషయాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ ప్రకటించారు.. నామినేషన్లు వేసిన 18 మందిలో 3 నామినేషన్ల ఉపసంహరణతో ఏకగ్రీవం అయినట్టుగా వివరించారు లోకేష్ కుమార్.. కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, రాగం నాగేందర్ యాదవ్, వనం సంగీత యాదవ్ నామినేషన్లు ఉపసంహరించుకున్నారని వెల్లడించిన ఆయన.. దీంతో స్టాండ్ కమిటీ ఎన్నికలు ఏకగ్రీవం అయినట్టు తెలిపారు.. ఇక, ఏక గ్రీవంగా ఎన్నికైన జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుల పేర్లను పరిశీలిస్తే.. కుర్మ హేమలత, పన్నాల దేవేందర్ రెడ్డి, ప్రవీణ్ సుల్తానా, వై. ప్రేమ్ కుమార్, బాత జబీన్, మహాపార, మందగిరి స్వామి, మందాడి శ్రీనివాస్ రావు, మీర్జా ముస్తాఫ బేగ్, మహమ్మద్ అబ్దూల్ సలామ్, ఎండీ రషీద్, రావుల శేషగిరి, సీఎన్ రెడ్డి, విజయ్ కుమార్ గౌడ్, సామల హేమ ఉన్నారు.
Read Also: బండి సంజయ్ కాన్వాయ్పై రాళ్ల దాడి.. కారు అద్దాలు ధ్వంసం
నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 15 నామినేషన్లతో కూడిన తుది జాబితాను జీహెచ్ఎంసీ విడుదల చేసింది. 15 మందిలో టీఆర్ఎస్ నుంచి ఎనిమిది మంది కార్పొరేటర్లు, ఎంఐఎం నుంచి ఏడుగురు స్టాండింగ్ కమిటీకి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వాస్తవానికి జీహెచ్ఎంసీలో భారతీయ జనతా పార్టీకి 47 మంది కార్పొరేటర్లు ఉన్నప్పటికీ స్టాండింగ్ కమిటీకి ఒక్క నామినేషన్ కూడా దాఖలు చేయలేదు. కాగా, ఎంఐఎం నుండి, గ్రేటర్ హైదరాబాద్లోని వివిధ వార్డుల నుండి మొత్తం 44 మంది కార్పొరేటర్లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జీహెచ్ఎంసీ స్టాండ్ కమిటీ ఎన్నికలకు నవంబర్ 2న నోటిఫికేషన్ విడుదల చేశారు.. నోటిఫికేషన్ ప్రకారం, జీహెచ్ఎంసీకి చెందిన 150 మంది కార్పొరేటర్ల ద్వారా మొత్తం 15 మంది సభ్యులను కమిటీకి ఎన్నుకోనున్నారు. నోటిఫికేషన్ వెలువడిన తర్వాత కార్పొరేటర్ల నుంచి మొత్తం 18 నామినేషన్లు రాగా.. 15 కంటే ఎక్కువ నామినేషన్లు ఉంటే నవంబర్ 20న స్టాండింగ్ కమిటీకి పోలింగ్ నిర్వహించాల్సి ఉంది. అయితే, ముగ్గురు నామినేషన్లు ఉపసంహరించు కోవడంతో ఏకగ్రీవం అయ్యింది.. దీంతో స్టాండింగ్ కమిటీకి ఎలాంటి పోలింగ్ జరగడం లేదని జీహెచ్ఎంసీ వర్గాలు చెబుతున్నాయి.