తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ నిన్న కరీంనగర్లోని బీజేపీ కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం జాగరణ దీక్ష చేపట్టారు. అయితే కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా బండి సంజయ్ దీక్ష చేస్తున్నారంటూ పోలీసులు బండి సంజయ్ చేస్తున్న జాగరణ దీక్షను నిలిపేందుకు బీజేపీ కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు బండి సంజయ్ను అరెస్ట్ చేసి ఈ రోజు కరీంనగర్ కోర్టులో హజరుపరిచారు.
దీంతో కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ను విధించింది. అయితే ఈ క్రమంలో బండి సంజయ్ లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాతో పాటు కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర సహాయ మంత్రి కిషన్రెడ్డిలతో పాటు తెలంగాణ గవర్నర్ తమిళసైకి లేఖ రాశారు. తన హక్కులకు భంగం కలిగిందని స్పీకర్కు పంపిన లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా కరీంనగర్ సీపీ సత్యనారాయణపై కూడా ఫిర్యాదు చేయడం గమనార్హం. అయితే ప్రివిలేజ్ కమిటీకి కూడా బండి సంజయ్ ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది.