ఏపీలో మరో భారీ ప్రాజెక్ట్ కి రంగం సిద్ధం అవుతోంది. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడులో రూ. 1500 కోట్లతో గ్రీన్ ఫీల్డ్ సిమెంట్ ప్లాంట్ ఏర్పాటుచేసేందుకు ముందుకొచ్చింది సిమెంట్ కంపెనీ. 24 నెలల్లో పూర్తిచేసేలా ప్రణాళికలు రెడీ అయ్యాయి. ఇప్పటికే 9 రాష్ట్రాలలో సిమెంట్ తయారీ, అనుబంధ రంగాలకు సంబంధించిన ప్లాంట్స్ ఏర్పాటు చేసింది శ్రీ సిమెంట్ గ్రూప్. ఈ గ్రూప్ నుంచి ఏపీలో మొట్టమొదటి ప్రాజెక్ట్ రాబోతోంది.
ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ను కలిసి చర్చించారు సిమెంట్ లిమిటెడ్ ఎండీ హెచ్ఎం.బంగూర్, జేఎండీ ప్రశాంత్ బంగూర్. ఏపీలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం, పారిశ్రామిక వర్గాలకు ఇస్తున్న ప్రోత్సాహకాలపై శ్రీ సిమెంట్ మేనేజ్మెంట్ టీమ్తో చర్చించారు సీఎం. ఈ సందర్భంగా శ్రీ సిమెంట్ ఎండీ హెచ్ఎం.బంగూర్, జేఎండీ ప్రశాంత్ బంగూర్లు మాట్లాడారు.
రాష్ట్రాభివృద్ధికోసం ముఖ్యమంత్రి చాలా చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. ఒక కంపెనీకి చెందిన ముఖ్యకార్యనిర్వాహణాధికారి ఏరకంగా ఆ కంపెనీ బాగోగులు చూసుకుంటారో.. అలాగే రాష్ట్ర బాగోగుల కోసం ముఖ్యమంత్రి కూడా అలాగే పనిచేస్తున్నారు. ప్రజలకు మెరుగైన ఆదాయాలు రావాలని సీఎం ఆకాంక్షిస్తున్నారు. రాష్ట్రంలో పారిశ్రామికీరణ పెద్ద ఎత్తున జరగాలని సీఎం కోరుకుంటున్నారు. దీనివల్ల రాష్ట్రానికి, ప్రజలకు ఆదాయాలు రావాలన్నది సీఎం ఉద్దేశం.
దేశం కంటే రాష్ట్ర వృద్దిరేటు అధికంగా ఉంది. భవిష్యత్తులో కూడా ఇది మరింతగా పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యమంత్రి ఆలోచనా దృక్పథంతో రాష్ట్రాభివృద్ధి మరింత పురోగమిస్తుంది. అందువల్లే మేం ఇక్కడ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నాం అన్నారు శ్రీ సిమెంట్ ఎండీ హెచ్ఎం.బంగూర్.
శ్రీ సిమెంటు ప్లాంటులో పనిచేసేవారికి జీతాల రూపంలో కాని, పరోక్షంగా ఉపాధి పొందుతున్న వారికి గాని నెలకు కనీసంగా రూ.20 కోట్ల రూపాయలు, రోజుకు కనీసంగా రూ.70 లక్షలు రూపాయలు నేరుగా చెల్లిస్తున్నాం అన్నారు. రోజువారీ ఉపాధి కార్యక్రమాల్లో భాగంగా డబ్బును వారికి ఇస్తున్నాం
పెద్ద సిమెంటు ప్లాంటు ఏర్పాటు వల్ల మంచి పారిశ్రామిక వాతావరణం ఏర్పడుతుంది. అనేక మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు లభిస్తాయి.పరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, సర్వీసులను అందించే క్రమంలో చాలామందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. వేల మందికి లబ్ధి జరుగుతుందన్నారు జేఎండీ ప్రశాంత్ బంగూర్. సమావేశంలో పాల్గొన్న ఎంపీ మిథున్ రెడ్డి, శ్రీ సిమెంట్ ప్రెసిడెంట్ (కమర్షియల్) సంజయ్ మెహతా, జీఎం జీవీఎన్.శ్రీధర్ రాజు, మేనేజర్ వెంకటరమణ, అసిస్టెంట్ మేనేజర్ సింహాద్రి చంద్రశేఖర్ పాల్గొన్నారు.