‘అయిపోయిందేదో అయిపోయింది… ఇక సమయం వృధా చేసుకోదల్చుకోలేదు’ అంటున్నారు ప్రముఖ దర్శకుడు వి. వి. వినాయక్. ఆయన మెగాఫోన్ పట్టి దాదాపు ఇరవై సంవత్సరాలు కావస్తోంది. తొలి చిత్రం ‘ఆది’ 2002లో విడుదలైంది. విశేషం ఏమంటే… దర్శకుడైన ఇరవై సంవత్సరాలకు వినాయక్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. అదీ ‘ఛత్రపతి’ లాంటి సూపర్ డూపర్ హిట్ మూవీ రీమేక్ తో. ఈ సినిమా పట్టాలెక్కే విషయంలోనూ రకరకాల పుకార్లు షికారు చేసినా, హైదరాబాద్ లో వేసిన విలేజ్ సెట్ వర్షాల కారణంగా డామేజ్ కావడంతో ఇప్పుడు దాన్ని మళ్ళీ సెట్ చేస్తున్నారు. సో… ఈ నెల 15న ఎట్టకేలకు ‘ఛత్రపతి’ సినిమా హిందీ రీమేక్ రెగ్యులర్ షూటింగ్ మొదలైపోతుంది.
Read Also: రాజీపడే ప్రసక్తే లేదు.. ఏపీతోనే కాదు.. దేవుడితోనూ కొట్లాడతాం..!
ఇదిలా ఉంటే… గడిచిన రెండు సంవత్సరాలలో వినాయక్ సమయం బోలెడంత వృధా అయిపోయింది. ఆయన కథానాయకుడిగా మొదలైన ‘శీనయ్య’ సినిమా అవుట్ పుట్ ఆశించిన స్థాయిలో రాకపోవడంతో మధ్యలోనే ఆగిపోయింది. తిరిగి సెట్స్ మీదకు తీసుకెళ్ళాలని ఎంత ప్రయత్నించినా, అది సాధ్యం కాలేదు. అలానే చిరంజీవి చేయబోయే ఓ రీమేక్ మూవీని వినాయక్ డైరెక్ట్ చేయబోతున్నాడని వార్తలు వచ్చాయి. కానీ అదీ వర్కౌట్ కాలేదు. ఆ రకంగా దాదాపు రెండేళ్ళు వేస్ట్ చేసుకున్న వినాయక్ ఇక మీదట మాత్రం సమయాన్ని వృధా చేసుకోబోనని తేల్చి చెప్పేశారు. ‘ఛత్రపతి’ రీమేక్ తర్వాత కూడా చేయబోయే సినిమాల గురించి ఇప్పటి నుండీ ఆయన ప్లానింగ్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ సినిమాల్లో నటించిన అవి అతిథి పాత్రలు తప్పితే, ప్రధాన పాత్రలు కాదని అంటున్నారు.