సీఎం కేసీఆర్పై బీజేపీ నాయకురాలు విజయశాంతి విమర్శలు గుప్పించారు. ట్వట్టర్ వేదికగా.. తెలంగాణలో కేసీఆర్ సర్కార్ నిరంకుశ పాలనను సాగిస్తోందని, రాష్ట్రంలో ఏ పథకాన్నీ సరిగ్గా అమలు చేయడం లేదు. ఒక్కటి కాదు, రెండు కాదు… ప్రతి దానిలోనూ తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోందన్నారు విజయశాంతి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఉచిత బియ్యానికి కోత పెట్టిన రాష్ట్ర సర్కారు… రూపాయికి కిలో బియ్యం కూడా సక్కగ ఇస్తలేదు. రేషన్ షాపులకు సకాలంలో బియ్యం సరఫరా చేయకపోవడంతో పేదల కడుపు మాడుతోందని మండిపడ్డారు.. దీనికి తోడు సర్వర్ డౌన్, సిగ్నల్ ప్రాబ్లమ్స్, వేయింగ్, బయోమెట్రిక్ మెషీన్లు పనిచేయకపోవడం వంటి కారణాలతో… రాష్ట్రవ్యాప్తంగా వేలాది పేద కుటుంబాలు బియ్యం అందక తిప్పలు పడుతున్నయి. రేషన్ షాపుల ద్వారా ప్రతి నెల ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు బియ్యం పంపిణీ చేయాల్సి ఉంది. కానీ గడువును 20వ తేదీ వరకు పొడిగించినా… బియ్యం అందని పరిస్థితి నెలకొందని ఆమె విమర్శించారు.
ప్రభుత్వం తీరు వల్ల ప్రజలే కాదు, డీలర్లు కూడా నష్టపోతున్నరు. రేషన్ షాపులకు రావాల్సిన కోటాను ఆలస్యంగా ఇస్తుండడంతో డీలర్లకు ఇబ్బందులు ఎదురవుతున్నయి. ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి… 15వ తేదీ వరకు బియ్యం పంపిణీ పూర్తి కాగానే… 20వ తేదీలోపు డీడీలు కట్టించుకుని, 30వ తేదీలోగా ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్ షాపులకు బియ్యం సరఫరా చేయాలి. కానీ, అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం వల్ల ఇదంతా ఆలస్యమవుతోందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్… పేదల కడుపు మీద కొట్టడం ఎంత వరకు సమంజసం? పేదలకు నాలుగు వేళ్లూ నోట్లోకి వెళ్లాలంటే రేషన్ బియ్యామే శరణ్యం. కానీ పేద బతుకులతో కేసీఆర్ సర్కార్ ఆడుకుంటోందని ఆమె మండిపడ్డారు.